Sachin Tendulkar: సచిన్ సెంచరీ కోసం.. విరిగిన చెయ్యితో బ్యాటింగ్! అతడు ఎవరంటే?
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:20 AM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్ ఆరంభం నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. తన సెంచరీ కోసం సహచర బ్యాటర్ విరిగిన చేతితోనే క్రీజులోకి వచ్చాడని.. అతడి త్యాగం వల్లే తనకు భారత జట్టులో చోటు దక్కిందని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. రికార్డుల సృష్టించాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా.. ఆయన తర్వాతే ఎవరైనా! సాధారణ ‘సచిన్’ నుంచి ‘క్రికెట్ దేవుడు’ వరకు.. ఆయన అందించిన సేవలు ఎనలేనివి. మరి సచిన్ కెరీర్ ఆరంభంలో ఓ వ్యక్తి చేసిన త్యాగమే అతడిని భారత క్రికెట్లో నిలదొక్కుకునేలా చేసిందని మీకు తెలుసా?
అది 1989-90 దేశీ క్రికెట్ సీజన్. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా-ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి. ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సచిన్(Sachin Tendulkar).. సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఇంతలో తొమ్మిదో వికెట్ పడింది. అప్పటికి బ్యాటింగ్కి రావాల్సిన ప్లేయర్ గాయపడ్డాడు. అతడే.. టీమిండియా మాజీ క్రికెటర్ ‘గురుశరణ్ సింగ్’(Gursharan Singh). అతడు బ్యాటింగ్ చేస్తేనే సచిన్ సెంచరీ చేయగలడు. సచిన్ శతకం కోసం గురుశరణ్ విరిగిన చేతితోనే బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అతడి అసాధారణ సహకారంతో సచిన్ 103 పరుగులు చేశాడు. ఆఖరి వికెట్కు గురుశరణ్, సచిన్ కలిసి 36 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ మ్యాచ్ ద్వారానే టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టు తరఫున అరంగేట్రానికి బాటలు వేసుకున్నాడు. తాజాగా ఈ విషయం గురించి సచిన్ గుర్తు చేసుకున్నాడు.
‘1989లో నేను ఇరానీ ట్రోఫీలో ఆడుతున్నా. టీమిండియా సెలక్షన్కు అది ట్రయల్ మ్యాచ్. నేను 90ల్లో బ్యాటింగ్ చేస్తున్నా. గురుశరణ్ సింగ్ చేయి విరిగింది. బ్యాటింగ్ చేసే స్థితిలో లేడు. కానీ బ్యాటింగ్కు వెళ్లి సహచరుడికి అండగా నిలవాలని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రాజ్సింగ్ దుంగార్పూర్ అతడిని ఆదేశించాడు. గురుశరణ్ క్రీజులోకి వచ్చి నా శతకానికి సహరించాడు. ఆ మ్యాచ్ తర్వాత నేను భారత జట్టుకు ఎంపికయ్యా. ఆపై అతడు కూడా జట్టులో భాగమయ్యాడు’ అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.
ఇవీ చదవండి:
Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?