Virat Kohli: కోహ్లీ మ్యాచ్.. చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
ABN , Publish Date - Dec 23 , 2025 | 02:47 PM
డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. దీనికి ఫ్యాన్స్కు అనుమతి ఇవ్వలేదు.
ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 24 నుంచి ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో 15 ఏళ్ల తర్వాత టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. చివరగా ఫిబ్రవరి 18, 2010లో ఈ టోర్నీలో ఆడిన విరాట్.. మళ్లీ ఇన్నాళ్లకు ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ టోర్నీలోని తొలి మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో వేదికగా జరగనుంది. ఇందులో ఢిల్లీ-ఆంధ్ర జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీకి ప్రాతినిధ్య వహిస్తున్న విరాట్.. సోమవారం రాత్రి బెంగళూరు చేరుకున్నాడు. అయితే కోహ్లీ(Virat Kohli) ఆడుతున్న మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటున్న అభిమానులకు మాత్రం ఓ చేదు వార్త అందింది.
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ లేకుండానే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచులు నిర్వహించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేష(KSCA)న్కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు స్టాండ్లు తెరిచి 2వేల నుంచి 3వేల మంది అభిమానులను లోపలికి అనుమతించాలని కేఎస్సీఏ కోరగా.. ఆ ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం తిరస్కరించింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాల రీత్యా అనుమతి నిరాకరించారు. గ్రేటర్ బెంగళూరు అథారిటీ కమిషనర్ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు నగర పోలీసు కమిషనర్, అగ్నిమాపక, అత్యవసర శాఖలు, ఆరోగ్యశాఖతో కూడిన ఈ కమిటీ త్వరలో చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. దాని ఆధారంగా ప్రేక్షకుల అనుమతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిపిన విజయోత్సవ సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అప్పటినుంచి చిన్నస్వామి మైదానంలో ఎలాంటి మ్యాచ్లు నిర్వహించలేదు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు అనుమతి ఇచ్చారు.
ఇవీ చదవండి: