BCCI: అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో ఓటమిపై బీసీసీఐ సీరియస్
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:36 AM
ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో ఘోరంగా ఓడి తొమ్మిదోసారి ఆ కప్ను కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది భారత్. ఫైనల్లో ఓటమి చెందడానికి గల కారణాలను విశ్లేషించేందుకు కోచ్, కెప్టెన్లతో బీసీసీఐ సమీక్ష నిర్వహించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్(Asia Cup) టోర్నీలో పాక్తో జరిగిన ఫైనల్లో భారత జట్టు పరాజయం కావడంతో బీసీసీఐ(BCCI) సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం. ఆయుష్ మాత్రే(Ayush Mahtre) నేతృత్వంలోని టీమ్ఇండియా(Team India) ఫైనల్ వరకూ అజేయంగా నిలిచి.. కీలకమైన తుది పోరులో బోల్తాకొట్టింది. ఫైనల్ మ్యా్చ్లో దాయాది జట్టు 347/8 పరుగుల భారీ స్కోర్ సాధిస్తే.. భారత టీమ్ 26.2 ఓవర్లలో 156 పరుగులకు పరిమితమై ఘోర ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో కుర్రాళ్ల ప్రదర్శనపై సోమవారం ఆన్లైన్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బోర్డు సభ్యులు చర్చించారు. జట్టు ఆటతీరుపై సమీక్షించాల్సిన అవసరముందని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ.. టీమ్ మేనేజ్మెంట్ను వివరణ కోరే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సమీక్షలో అండర్-19 హెడ్ కోచ్ హృషీకేశ్ కనిత్కర్(Coach Hrishikesh Kanitkar), కెప్టెన్ ఆయుష్ మాత్రేలతో బోర్డు సభ్యులు చర్చించనున్నారు. 2026 జనవరిలో అండర్-19 ప్రపంచకప్ ప్రారంభం కానున్న తరుణంలో.. ఈ మెగా టోర్నీకి ముందు టీమ్లో లోపాలను సరిదిద్దుకుని ముందడుగు వేయాలని బీసీసీఐ భావిస్తోంది. అంతేకాకుండా.. ఫైనల్లో భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavamsi), ఆయుష్ మాత్రే హద్దుమీరి ప్రవర్తించడంపై కూడా బీసీసీఐ వివరణ కోరే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి: