Prithvi Shaw: 4 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. సచిన్ చెప్పిన మాటతో..!
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:56 PM
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా రీఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. ఎలాగైనా భారత జెర్సీని తిరిగి వేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకోసం దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పిన ఓ మాటను అతడు స్ఫూర్తిగా తీసుకుంటున్నాడు.

ఎంత ప్రతిభ ఉన్నా కొందరు ఆటగాళ్లు కెరీర్లో అనుకున్న స్థాయికి ఎదగలేరు. టైమ్ కలసిరాకపోవడం, స్వీయ తప్పిదాలు లాంటివి ప్లేయర్లను రేసులో వెనుకపడేలా చేస్తుంటాయి. అలా అనుకున్న రేంజ్కు చేరుకోని క్రికెటర్లలో టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా ఒకడు. అపారమైన టాలెంట్ ఉన్నప్పటికీ భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయాడు షా. 4 ఏళ్ల కింద మెన్ ఇన్ బ్లూకు దూరమైన అతడు.. క్రమశిక్షణను పాటించకపోవడం, అధిక బరువు, ఫామ్ లేమి లాంటి సమస్యల వల్ల ఐపీఎల్ నుంచీ కనుమరుగయ్యాడు. అయితే దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పిన ఒక్క మాటతో తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు అతడు సిద్ధమవుతున్నాడు.
మళ్లీ వచ్చేయ్ అంటూ..
గతంలో ఏ దారిలో నడిచావో తిరిగి అదే తోవలోకి వచ్చేయ్ అంటూ సచిన్ తనకు విలువైన సలహా ఇచ్చాడని పృథ్వీ షా తెలిపాడు. ‘క్రికెటర్గా నా ప్రయాణం సచిన్ సార్కు తెలుసు. అర్జున్ టెండూల్కర్తో నాకు 8 ఏళ్ల వయసు నుంచి సాన్నిహిత్యం ఉంది. మేం చాలా మంచి స్నేహితులం. ఇద్దరం ఒకే చోట ప్రాక్టీస్ కూడా చేశాం. సచిన్ సార్తోనూ నాకు అనుబంధం ఉంది. నేను కమ్బ్యాక్ ఇవ్వగలనని ఆయన నమ్ముతున్నారు. సరైన దారిలోకి మళ్లీ వచ్చేయ్ అని సూచించారు. రాబోయే కొన్నేళ్లలో అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు. కాగా, దేశవాళీల్లో ముంబై జట్టు తరఫున ఆడుతూ వస్తున్న ఈ బ్యాటర్.. అక్కడ సరైన అవకాశాలు దొరకకపోవడంతో టీమ్ మారాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు తనకు ఎన్వోసీ ఇవ్వాలని ఎంసీఏకు అతడు దరఖాస్తు చేసుకున్నాడు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి