UK Job Crisis: ఇక్కడి చదువులు వృథా.. భారతీయులకు లండన్లోని ఎన్నారై యువతి సూచన
ABN , Publish Date - May 13 , 2025 | 11:41 PM
ఉన్నత చదువులు చదివేందుకు యూకేకు రావాలనుకుంటున్న వారు ఆ ఆలోచనను మానుకోవాలంటూ అక్కడి భారతీయ యువతి చేసిన సూచన ప్రస్తుతం వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్లో ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న వారు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని లండన్లో ఉంటున్న ఓ భారతీయ యువతి విజ్ఞప్తి చేసింది. అక్కడ విదేశీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయని, వీసా నిబంధనలు మరింత కఠినంగా మారాయని చెప్పింది. జాహ్నవి అనే యువతి పెట్టిన ఈ పోస్టుపై ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
జాహ్నవి లండన్లో మార్కెటింగ్ ప్రొఫెషనల్గా ఉన్నారు. అయితే, తనతో పాటు వచ్చిన 90 శాతం మంది స్నేహితులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాక జాబ్ రాకపోవడంతో ఇండియాకు వెనక్కు వెళ్లిపోయారని అన్నారు. ‘‘ఇక్కడ అసలు ఉద్యోగాలు లేవు. మాస్టర్స్ కోసం లండన్కు రావడంపై నన్ను అనేక మంది రకరకాల సందేహాలు అడుగుతుంటారు. నేనైతే ఇక్కడకు రావద్దనే సలహా ఇస్తా. నా బ్యాచ్మేట్స్లో 90 శాతం మంది ఉద్యోగాలు లేక వెనక్కు వెళ్లిపోయారు. మీకు బాగా డబ్బుంటే తప్ప ఇక్కడకు రాకండి. అసలు ఈ ఆలోచనే పెట్టుకోకండి’’ అని ఆమె స్పష్టం చేశారు.
డిగ్రీని తాను ఇండియాలోనే చదివానని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం బ్రిటన్కు వచ్చానని ఆమె చెప్పారు. తనకు ఉద్యోగం లభించడం ఓ యాధృచ్ఛిక ఘటన అని అన్నారు. అయితే, గతంలో పరిస్థితులు ఇలా ఉండేవి కావని అన్నారు. అప్పట్లో యూకేకు వచ్చిన వారిలో కనీసం 70 శాతం మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత ఉద్యోగాలు లభించేవని అన్నారు.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆమె అభిప్రాయంతో ఏకీభవించారు. ఈయూలో ఉద్యోగం, మనకంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడెంతో కష్టమని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, తరుగుతున్న ఉద్యోగావకాశాలు, మితిమీరిన పోటీ పెను సవాళ్లుగా మారాయని చెప్పారు. వాస్తవాలు చెప్పినందుకు కొందరు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
మరాఠీ మాట్లాడితేనే డబ్బులిస్తా.. డెలివరీ ఏజెంట్కు షాక్
కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ