Experium Park: అబ్బురపరిచే ఎక్స్ పీరియం పార్క్... ఎక్కడ ఉందో తెలుసా
ABN, Publish Date - Jan 28 , 2025 | 06:48 PM
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(మంగళవారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏకంగా 150 ఎకరాల్లో ఈ పార్క్ను ఏర్పాటు చేశారు. ఇందులో 85 దేశాల నుంచి దిగుమతి చేసిన 25 వేల వివిధ జాతుల మొక్కలు, వృక్షాలు ఉన్నాయి.

అలాగే రూ. లక్ష నుంచి రూ. 3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఈ పార్కులో కనువిందు చేస్తున్నాయి.

ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీపార్క్ హైదరాబాద్కు తలమాణికమని సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. ఫ్రెండ్లీపార్క్ ఏర్పాటుతో చాలా మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఎవరైనా భూములుంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నారని.. డబ్బులు ఉంటే వ్యాపారం చేస్తున్నారని చిరంజీవి తెలిపారు. రామ్దేవ్ ఫ్యాషన్తో ఇక్కడ పార్క్ను అభివృద్ధి చేశారని ఉద్ఘాటించారు. త్వరలో ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తానని చిరంజీవి తెలిపారు.

ఇప్పటికే పలు వృక్షాలను వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కొనుగోలు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు ఎక్స్పీరియం పార్క్లో అబ్బురపరుస్తున్నాయి.

దీని కోసం రాందేవ్రావ్ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఈ పార్క్ను ఏర్పాటు చేశారు. ఏకంగా 1500 మంది సేదతీరేలా యాంఫీ థియేటర్ను పార్కులో రూపొందించారు.

పర్యాటక పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సాహిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు.

ఈ పార్కులో అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, వివిధ రకాల స్టోన్స్, అందమైన శిలలు సేకరించి గార్డెన్ను ఏర్పాటు చేశారు.

ఇందుకోసం సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేశారు. 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద యాంపీ థియేటర్ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 50 కోట్లతో 12 ఎకరాల్లో మ్యాన్మేడ్ బీచ్ ఏర్పాటు చేశారు.

40 గదులు, 20 కాటేజీలతో సుందరమైన సహజ రిసార్టు ద్వీపంగా తీర్చిదిద్దారు. ప్రీవెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్, ఫొటో షూట్లకు ఎక్స్పీరియాన్ని రామ్దేవ్రావు ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు. దేశానికి గర్వకారణంగా, రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా, హైదరాబాద్కు ఐకానిక్గా ఎక్స్పీరియం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

దేశానికి గర్వకారణంగా, రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా, హైదరాబాద్కు ఐకానిక్గా ఎక్స్పీరియం పార్క్ ఉండనుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అటవీ ప్రాంతాల సందర్శన కోసం మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆలయాల దర్శనాల కోసం తమిళనాడుతో పాటు చాలా ప్రాంతాలకు వెళ్తున్నామని తెలిపారు. అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.

తెలంగాణలో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయని.. రామప్ప, వెయ్యిస్థంభాల గుడి, వేములవాడ వంటి.. ప్రపంచ ప్రఖ్యాత ఆలయాలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. కవ్వాల్, నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ వంటి ప్రాంతాలున్నాయని చెప్పారు. మన ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు తగిన గుర్తింపు రాలేదన్నారు. తెలంగాణలో టెంపుల్, ఎకో టూరిజం వెనకబడుతోందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.

ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. తెలంగాణలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
Updated at - Jan 28 , 2025 | 10:30 PM