PM Modi: ఇక్కడ శశి థరూర్..ఇది కొంత మందికి నిద్ర కూడా పట్టదన్న ప్రధాని మోదీ
ABN , Publish Date - May 02 , 2025 | 01:12 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కేరళలోని విజిన్జం అంతర్జాతీయ సీపోర్ట్ ప్రారంభించారు. ఈ క్రమంలో మోదీ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు శశి థరూర్ ఇక్కడ కూర్చున్నారని, ఇది కొంత మందికి నిద్ర లేకుండా చేస్తుందన్నారు.

కేరళలో విజిన్జం అంతర్జాతీయ సీపోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో శశి థరూర్ ఉన్నారని, ఇది కొందరి నిద్రను భంగం చేస్తుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తిరువనంతపురం నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్ (Shashi Tharoor) గురించి ప్రధాని నేరుగా ప్రస్తావించడం అరుదైన విషయమని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పుడు శశి థరూర్ బీజేపీలో చేరారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కేరళలోని కాంగ్రెస్ పార్టీలో థరూర్ స్థానం గురించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో వచ్చాయి. ఇదే సమయంలో థరూర్ తన వ్యక్తిగత ఇమేజ్ను పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి వేరుగా ప్రొజెక్ట్ చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినపడుతోంది.
బయటకు వచ్చేశారా..
ఎందుకంటే ప్రధాని మోదీని తిరువనంతపురం విమానాశ్రయంలో శశి థరూర్ స్వయంగా స్వాగతించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆలస్యం జరిగినప్పటికీ, థరూర్ సకాలంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా థరూర్, ప్రధానిని స్వాగతిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆలస్యం జరిగినప్పటికీ, నా నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా తిరువనంతపురంలో సకాలంలో ల్యాండ్ అయ్యానని శశి థరూర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కేరళ కాంగ్రెస్ యూనిట్లో "నాయకత్వ శూన్యత" ఉందని థరూర్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ నాయకత్వంతో ఆయన సంబంధాలపై చర్చలకు దారితీశాయి. ఇటీవల ఆయన రాహుల్ గాంధీతో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై తన భవిష్యత్తు గురించి చర్చించారు. కానీ ఈ సమావేశాల నుంచి ఎలాంటి పురోగతి రాలేదని తెలుస్తోంది.
థరూర్కు ధన్యవాదాలు
మరోవైపు బీజేపీ కేరళ యూనిట్ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ ఈ ఏడాది మార్చిలో థరూర్ను ప్రశంసించారు. భారత్ వ్యాక్సిన్ దౌత్యం, రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణలో ప్రభుత్వ విధానాలను థరూర్ అభినందించినందుకు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు మోదీ ప్రభుత్వ విజయాలను గుర్తించినందుకు థరూర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక రాహుల్ గాంధీ ఇటీవల కేరళ కాంగ్రెస్ నాయకుల చిత్రాన్ని షేర్ చేశారు. అందులో థరూర్ ఉన్నట్లు కనిపిస్తోంది. వారు ఒక్కటిగా నిలబడ్డారని రాహుల్ పేర్కొన్నారు. కానీ థరూర్ మాత్రం తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను కాంగ్రెస్ లక్ష్యాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, పార్టీకి తన సేవలు అవసరం లేకపోతే ఇతర ఆప్షన్లను పరిశీలిస్తానని కూడా ఆయన సూచించారు.
విజిన్జం సీపోర్ట్
విజిన్జం అంతర్జాతీయ సీపోర్ట్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో ఒకటి. రూ. 8,867 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ సీపోర్ట్ అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో కీలక ట్రాన్స్షిప్మెంట్ హబ్గా ఈ సీపోర్ట్ నిర్మితమైంది. ప్రధాని మోదీ హెలికాప్టర్లో ఈ స్థలానికి చేరుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
GT vs SRH Prediction: నేటి హైదరాబాద్ vs గుజరాత్ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్..మనోళ్లు గెలుస్తారా లేక..
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Read More Business News and Latest Telugu News