H-1b Visa: ట్రంప్ హెచ్-1బీ వీసా ప్రకటన.. అమాంతం పెరిగిన భారత్-అమెరికా విమాన టిక్కెట్ల ధరలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:40 PM
ట్రంప్ వీసా ఫీజలు పెంపు, 24 గంటల్లో అమెరికాలో ఉండాలన్న కంపెనీల డెడ్లైన్తో ఎన్నారైల్లో కలకలం రేగింది. ఢిల్లీ న్యూయార్క్ విమాన టిక్కెట్ల ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. విదేశాలకు వెళ్లేందుకు అమెరికాలో విమానమెక్కిన అనేక మంది ట్రంప్ ప్రకటన గురించి తెలియగానే విమానాలు దిగిపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఎన్నారైల లైఫ్ను ఒక్కసారిగా తలకిందులు చేసింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ లోపే అమెరికాకు చేరుకోవాలంటూ అక్కడి టెక్ కంపెనీలు విదేశీ ఉద్యోగులకు స్పష్టం చేశాయి. దీంతో డెడ్లైన్ లోపు అమెరికాకు వెళ్లేందుకు ఎన్నారైలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఫలితంగా విమాన టిక్కెట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ధరలు రెట్టింటపయ్యాయి. ఇక విదేశాలకు వెళ్లేందుకు అమెరికాలో విమానం ఎక్కిన అనేక మంది ఎన్నారైలు ట్రంప్ ప్రకటన గురించి తెలియగానే విమానం దిగిపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (Airfare Surge India US After Visa Fee Hike).
ట్రంప్ ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 21 రాత్రి 12.01 లోపు ఎన్నారైలు అమెరికాకు చేరుకోవాలి. లేని పక్షంలో వారు పని చేస్తున్న సంస్థలు లక్ష డాలర్లు చెల్లిస్తే కానీ విదేశీ ఉద్యోగులకు అనుమతి లభించదు. దీంతో, అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గన్ వంటి సంస్థలు హెచ్-1బీ వీసాదారులను అమెరికా వీడొద్దని హెచ్చరించాయి. విదేశాల్లో ఉన్న వారిని వెంటనే తిరిగి రావాలని ఆదేశించాయి.
ఈ నేపథ్యంలో దసరా పండుగకు భారత్ వచ్చిన ఎన్నారైలు, బిజినెస్, విహార యాత్రలపై విదేశాల్లో ఉన్న వారు అకస్మాత్తుగా చిక్కుల్లో పడిపోయారు. ‘సెప్టెంబర్ 21 అర్ధరాత్రి 12.01 లోపు అమెరికాకు చేరుకోని వారంతా చిక్కుల్లో పడ్డట్టే. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వారు ఈ డెడ్ లైన్ను మిస్ అయినట్టే’ అని అమెరికా ఇమిగ్రేషన్ లాయర్ సైరస్ మెహతా అన్నారు. ట్రంప్ ప్రకటన తరువాత ఢిల్లీ-న్యూయార్క్ విమాన టిక్కెట్లు దాదాపు రెట్టింపై రూ.80 వేలకు చేరుకున్నాయి (Indian techies Rush Flights).
అమెరికా ఎయిర్పోర్టుల్లో కూడా కలకలం పతాకస్థాయికి చేరుకుంది. తమ సీట్లల్లో కూర్చుని జర్నీకి రెడీ అయిన అనేక మంది అప్పటికప్పుడు విమానం దిగిపోయారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దుబాయ్లో కూడా దాదాపు ఇలాంటి సీన్లు కనిపించాయని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
దసరా సందర్భంగా శూర్పణఖ దహనం.. పురుష హక్కుల సంఘం సంచలన ప్రకటన
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి