Share News

Rahul Gandhi DU: రాహుల్ గాంధీ డీయూ పర్యటన వివాదం.. ప్రోటోకాల్ ఉల్లంఘనగా పేర్కొన్న ఢిల్లీ విశ్వవిద్యాలయం

ABN , Publish Date - May 23 , 2025 | 12:14 PM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో హాట్ టాపిక్‎గా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం (Rahul Gandhi DU Visit) సందర్శించడం పట్ల DU అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సంస్థాగత ప్రోటోకాల్ ఉల్లంఘన అని వెల్లడించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Rahul Gandhi DU: రాహుల్ గాంధీ డీయూ పర్యటన వివాదం.. ప్రోటోకాల్ ఉల్లంఘనగా పేర్కొన్న ఢిల్లీ విశ్వవిద్యాలయం
Rahul Gandhi DU Visit 2025

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలోనూ ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అనుమతి లేకుండా సందర్శనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2023 మేలో ఆయన పీజీ మెన్స్ హాస్టల్‌ను సందర్శించి, విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసినప్పుడు కూడా విశ్వవిద్యాలయం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో హాస్టల్ ప్రొవోస్ట్, జడ్ ప్లస్ భద్రత ఉన్న రాహుల్ గాంధీ ఇలాంటి అనధికార సందర్శనలు సముచితం కాదని నోటీసు జారీ చేశారు. తాజాగా ఈసారి కూడా, రాహుల్ గాంధీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గురువారం (మే 22న) DUSUకు వచ్చారని (Rahul Gandhi DU Visit) విశ్వవిద్యాలయం మరోసారి గుర్తు చేసింది.


తాజాగా మరోసారి సందర్శన

రాహుల్ గాంధీ ఈ సందర్శనలో NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) అనుబంధ సంస్థకు చెందిన విద్యార్థులతో సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను పంచుకున్నారు. విద్యా సంస్థల్లో కుల ఆధారిత వివక్ష, ఫ్యాకల్టీలో అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం లోపం, ప్రముఖ కంపెనీల ఉద్యోగ అవకాశాల నుంచి వారి మినహాయింపు వంటి అంశాలపై చర్చ జరిగింది. రాహుల్ గాంధీ ఈ సందర్భంలో బీ.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తిని విద్యార్థులు స్వీకరించాలని, "విద్య, ఆందోళన, సంఘటన" అనే అంబేద్కర్ సందేశాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.


వివాదం ఎందుకు?

అయితే రాహుల్ సందర్శన విశ్వవిద్యాలయ పరిపాలనకు ముందస్తు సమాచారం లేకుండా జరగడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటనలపై విశ్వవిద్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదని, ఇలా జరిగితే సంబంధిత విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. DU ప్రొక్టర్, ప్రొఫెసర్ రజనీ అబ్బి జారీ చేసిన ప్రకటనలో "రాహుల్ గాంధీ రెండోసారి విశ్వవిద్యాలయానికి ముందస్తు సమాచారం లేకుండా వచ్చారు. ఈ సందర్శన విద్యార్థుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించిందని పేర్కొన్నారు. అధికారులు ఈ సందర్శనను "సంస్థాగత ప్రోటోకాల్ ఉల్లంఘన"గా అభివర్ణించారు.


NSUI, DUSU అధ్యక్షుడి స్పందన

DUSU అధ్యక్షుడు రోనక్ ఖత్రీ, రాహుల్ గాంధీ సందర్శనను సమర్థించారు. ఖత్రీ తన ప్రకటనలో DUSU అధ్యక్షుడిగా నాకు ఎవరినైనా ఆహ్వానించే హక్కు ఉంది. ఈ సందర్శన పూర్తిగా శాంతియుతంగా, DUSU కార్యాలయం పరిధిలోనే జరిగింది. దీనికి ముందస్తు అనుమతి అవసరం లేదన్నారు. విశ్వవిద్యాలయం ఈ విషయంలో రాజకీయ కారణాలతో విమర్శిస్తోందని, విద్యార్థుల స్వయం ప్రతిపత్తిని కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ సందర్శన విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిందని, యువతను బలోపేతం చేసే దిశగా భేటీ జరిగిందని ఖత్రీ అభిప్రాయపడ్డారు.

ఏబీవీపీ మాత్రం..

మరోవైపు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఈ సందర్శనను తీవ్రంగా విమర్శించింది. రాహుల్ గాంధీ కేవలం NSUI సభ్యులతోనే సంభాషించారని, ఇతర విద్యార్థి సంఘాల ప్రతినిధులను పక్కనపెట్టారని ఆరోపించారు. ఇది విద్యార్థులతో నిజాయితీగా జరిగిన సంభాషణ కాదని, కేవలం NSUI కార్యకర్తలతో జరిగిన ఒక ఎకో ఛాంబర్ సమావేశం మాత్రమేనని ABVP తన ప్రకటనలో తెలిపింది.


ఇవీ చదవండి:

మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌‎గా తమన్నా..విమర్శలు

నేడు ఆర్సీబీ vs హైదరాబాద్ మ్యాచ్..ఆర్సీబీ ఓడితే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 12:41 PM