Rahul Gandhi: ఓట్ చోరీ ప్రచారం.. స్పూఫ్ వీడియో షేర్ చేసిన రాహుల్
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:12 PM
బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్కు వ్యతిరేకంగా 'ఓటర్ అధికార్ యాత్ర'ను రాహల్ గాంధీ ప్రకటించారు. ఈ ప్రచారంలో పాల్గొనాలని ప్రజలను ఆయన కోరారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్ గడ్డపై నుంచే ఆగస్టు 17 నుంచి 'ఓటర్ అధికార్ యాత్ర'ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ: ఓట్ చోరీకి పాల్పడుతోందంటూ ఎన్నికల కమిషన్పై వరుస విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ఓట్ల చౌర్యంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హాస్యం, వ్యంగ్యం మేళవించిన స్పూఫ్ వీడియోను శనివారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు. బాలీవుడ్ చిత్రం 'లాపతా లేడీస్' స్ఫూర్తితో ఈ వీడియోను రూపొందించారు.
'రహస్యంగా, దొంగతనంగా... ఇక వద్దు, ప్రజలు మేలుకొన్నారు' అని రాహుల్ ఆ వీడియోతో పాటు ఒక పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక మధ్యవయస్కుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వస్తాడు. ఏమి పోయిందని అధికారి అడుగుతాడు. ఆ వ్యక్తి కొద్దిసేపు ఆగి... 'నా ఓటు'.. అని చెబుతాడు. ఆశ్చర్యపోవడం ఆ పోలీసు అధికారి వంతవుతుంది. 'ఓటు ఎత్తుకెళ్లడం ఎవరికైనా ఎలా సాధ్యమవుతుంది?' అని ఆయన అడుగుతాడు. 'నకిలీ ఓట్ల ద్వారా లక్షలాది ఓట్లు చోరీ అవుతున్నాయి' అని ఆ మధ్యవయస్కుడు జవాబిస్తాడు. 'ఒకరి ఓటును దోచుకోవడం అంటే ఒకరి హక్కును దోచుకోవడమే' అనే సందేశంతో వీడియో ముగుస్తుంది.
ప్రూఫ్ ఇవ్వండి..
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న విస్తృత ప్రచారాన్ని ఈసీ ఇటీవల ప్రశ్నించింది. 'ఓట్ చోరీ' అంటూ అభ్యంతరకర పదబంధాలను ఉపయోగించడానికి బదులు ఆధారాలు ఉంటే చూపెట్టాలని సూచించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశంలోని ఓటర్లంతా దొంగలేనన్నట్టుగా మాట్లాడటం సరికాదని, ఏ ఎన్నికల్లో అయినా ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేసినట్టు ఆధారం ఉంటే లిఖితపూర్వత అఫిడవిట్తో ఈసీఐ దృష్టికి తీసుకురావాలని కోరింది.
ఓటర్ ఆధికార్ యాత్ర
కాగా, బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్కు వ్యతిరేకంగా 'ఓటర్ అధికార్ యాత్ర'ను రాహల్ గాంధీ ప్రకటించారు. ఈ ప్రచారంలో పాల్గొనాలని ప్రజలను ఆయన కోరారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా బీహార్ గడ్డపై నుంచే ఆగస్టు 17 నుంచి 'ఓటర్ అధికార్ యాత్ర'ను ప్రారంభిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ తెలిపారు. ఇది కేవలం ఎన్నికల అంశం కాదని, ప్రజాస్వామ్యాన్ని, ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే సిద్ధాంతాన్ని పరిరక్షించేందుకు చేస్తున్న నిర్ణయాత్మకమైన యుద్ధమని అన్నారు. రైతులు, కార్మికులు, ప్రతి పౌరుడు ఈ అంశంపై గళం ఎత్తి ఈ ప్రజాఉద్యమంలో పాల్గొనాలని కోరారు. ఈసారి ఓటు దొంగల ఓటమి, ప్రజా విజయం, రాజ్యాంగ విజయం తథ్యమని అన్నారు.
ఇవి కూడా చదవండి..
పద్మశ్రీ బులా చౌదరి గోల్డ్మెడల్స్ ఎత్తుకెళ్లిన దొంగలు
ప్రధాని మోదీ అబద్ధాల కోరు.. జైరామ్ రమేశ్ ఫైర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి