Dharali Tragedy: ధరాలి బాధితుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నా: మోదీ
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:33 PM
ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడానని, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో మెరుపు వరదలకు ధరాలీ (Dharali) గ్రామం అతలాకుతులం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ధరాలి బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నామని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ ధామితో మాట్లాడానని, పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలను కాపాండేందుకు కేంద్ర బృందాలు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.
సీఎంతో మాట్లాడిన అమిత్షా
కాగా, కేంద్ర మంత్రి అమిత్షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో ఫోనులో మాట్లాడారు. ధరాలిలో తాజా వరదల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత ప్రజలను ఆదుకునేందుకు ఏడు రెస్క్యూ టీమ్లను పంపుతున్నట్టు తెలిపారు. సమీపంలోని మూడు ఐటీబీపీ టీమ్లను ఘటనా స్థలికి పంపామని, నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు కూడా బయలుదేరాయని, సాధ్యమైనంత త్వరగా అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపడతాయని అమిత్షా తెలిపారు.
ధరాలిలో విలయం
మెరుపు వరదలతో ధరాలీ గ్రామం కొట్టుకుపోయింది. సముద్రం విరుచుకుపడినట్టుగా మేఘాలు వర్షించడంతో నీరు, మట్టి కలిసి భారీ ఎత్తున వరద ధరాలిని కప్పేసింది. గంగోత్రికి వెళ్లే దారిలో ధరాలి గ్రామం ఉండగా, వరదల తాకిడికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని కొట్టుకుపోయాయి. కనీసం నలుగురు మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. మరో 50 మందికి పైగా జాడ గల్లంతయినట్టు తెలుస్తోంది. కాగా, సమాచారం తెలియగానే ఉత్తరాఖండ్లోని మాట్లి గ్రామంలో నిలిపి ఉంచిన ఐటీబీపీ 12వ బెటాలియన్కు చెందిన 16 మంది సభ్యుల బృందం ధరాలి చేరుకుని సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతోంది.
ఇవి కూడా చదవండి..
జల ప్రళయం.. కొట్టుకుపోయిన గ్రామం
మణిపూర్లో మరో ఆరు నెలలు రాష్ట్రపతి పాలన, రాజ్యసభ ఆమోదం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి