President Murmu At Red Fort Dasara: ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
ABN , Publish Date - Oct 02 , 2025 | 08:50 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన దసరా వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బాణం ఎక్కుపెట్టగా.. రావణ దహనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 02: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాద రావణుడిపై నిర్ణయాత్మక విజయానికి ప్రతీకని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. మానవత్వంపై ఉగ్రవాదం దాడి చేసినప్పుడు.. దానిని ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. గురువారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోట మాధవదాస్ పార్క్లో జరిగిన దసరా వేడుకలకు ఆమె హాజరయ్యారు.
ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాద రావణుడిపై జరిపిన విజయమని ముర్ము పేర్కొన్నారు. ఆ క్రమంలో మన దేశ సైనికులకు వందనం చేస్తున్నామని స్పష్టం చేశారు. చెడుపై మంచి, అహంకారంపై వినయం, ద్వేషంపై ప్రేమకు ప్రతీకగా ఈ దసరా పండగ నిలుస్తుందని చెప్పారు. ఎర్రకోటలోని మాధవదాస్ పార్క్లో నిర్వహించిన ఈ దసరా వేడుకలను రామ్లీలా కమిటీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విల్లు ఎక్కపెట్టగానే.. రావణ దహన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వేడుకులకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా విజయదశమిలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు వివిధ నగరాల్లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన దసరా ఉత్సవాల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. వారణాసిలో నిర్వహించిన రావణ దహనానికి ప్రజలు భారీగా పోటెత్తారు. అలాగే మైసూర్లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ దసరా ఉత్సవాలు నేటితో మగియనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
స్వగ్రామంలో దసరా వేడుకలు.. పాల్గొన్న సీఎం రేవంత్
దసరా వేళ విషాదం.. పూజ చేస్తూ కుప్పకూలిన పూజారి..
For More National News And Telugu News