Bihar Election: బిహార్ ఫలితాల ప్రభావం మాపై ఉండదు: తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:37 PM
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం బెంగాల్పై ఉండదని టీఎమ్సీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ నేతల సంబరాలు నిర్హేతుకమని కామెంట్ చేశారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు వేర్వేరని వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్లో ఎన్డీయే ఘన విజయం సాధించింది. మహాగఠ్బంధన్కు ఊహించని ఓటమి ఎదురైంది. బిహార్లో పని పూర్తయ్యిందన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. ఇక పశ్చిమ బెంగాల్ వంతు అని కామెంట్ చేశారు. దీంతో, బెంగాల్లోని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఎగసిపడుతోంది. అయితే, బిహార్ ఎన్నికల ప్రభావం బెంగాల్పై ఉండదని అధికారి టీఎమ్సీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి.
బిహార్ ఫలితాల తరువాత బెంగాల్లో బీజేపీ సాల్ట్ లేక్ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. నందీగ్రామ్ నుంచి కూచ్ బేహార్ వరకూ బెంగాల్లోని పార్టీ కార్యాలయాల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. బెంగాల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నిమజ్జనం చేయకతప్పదని కొందరు కామెంట్ చేశారు.
బిహార్లో గెలుపుపై బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య స్పందించారు. ‘ఇక పోరు బెంగాల్లో మొదలవుతుంది. ఎన్నికల్లో టీఎమ్సీ నిమజ్జనం పక్కా అని మేము విశ్వసిస్తున్నాము. దీదీ (మమతా బెనర్జీ) సోదరుడు అరవింద్ కేజ్రీవాల్ను ఓడించాము. ఆ తరువాత హర్యానా, మహారాష్ట్రా.. ఇప్పుడు బిహార్లో విజయం. ఇక బెంగాల్ వంతు వచ్చింది’ అని అన్నారు.
అయితే, బిహార్ ఫలితాల ప్రభావం బెంగాల్పై ఉండని టీఎమ్సీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై టీఎమ్సీ ప్రతినిధి కునాల్ ఘోష్ మాట్లాడారు. ‘బిహార్ విజయం తాలూకు ప్రభావం బెంగాల్పై ఉంటుందని కొందరు బీజేపీ నేతలు సంతోషపడుతున్నారు. కానీ ఒక విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను. బిహార్ ఎన్నికలకు బెంగాల్ ఎన్నికలు పూర్తిగా భిన్నం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. కాబట్టి వారి సంబరాలు అర్థరహితమే’ అని అన్నారు.
ఇవీ చదవండి:
రాఘోపూర్లో తేజస్వీ యాదవ్తో దోబూచులాడిన విజయం.. మొదట్లో లీడ్..అంతలోనే..
కశ్మీరీలు అందరినీ ఒకే గాటన కట్టొద్దు: ఒమర్ అబ్దుల్లా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి