Amit Shah: 24 ఏళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని మోదీ.. ప్రశంసలు కురిపించిన అమిత్షా
ABN , Publish Date - Sep 22 , 2025 | 09:36 PM
దేశం మునుపెన్నడూ చూడని ప్రజాకర్షక ప్రధానమంత్రి మోదీ అని, ఇటు స్వదేశంలోనూ, అంతర్జాతీయంగానూ అత్యంత జనాకర్షణ కలిగిన ప్రధానిగా పేరుతెచ్చుకున్నారని అమిత్షా పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దృఢమైన పనితీరుపై ఆయన మంత్రివర్గ సహచరుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit Shah) ప్రశంసలు కురిపించారు. గత 24 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని ఏకైక నేత మోదీ అని చెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో చెక్కుచెదరని నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు.
'గత 24 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోని ఒకే ఒక్క వ్యక్తిని నేను చూశాను. ఆయనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇంతటి నిబద్ధత ఆషామాషీగా వచ్చేది కాదు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం వల్లేనే ఇది సాధ్యమైంది' అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్షా చెప్పారు.
మోస్ట్ పాపులర్ పీఎం
దేశం మునుపెన్నడూ చూడని ప్రజాకర్షణ కలిగిన ప్రధానమంత్రి మోదీ అని, ఇటు స్వదేశంలోనూ, అంతర్జాతీయంగానూ అత్యంత జనాకర్షణ కలిగిన ప్రధానిగా పేరుతెచ్చుకున్నారని అమిత్షా పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు కూడా దీనిని బలంగా విశ్వసిస్తున్నాయని చెప్పారు. అదే విధంగా ఒక ప్రధానిగా, ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన ఘనత కూడా మోదీదేనని అన్నారు.
విదేశాంగ విధానానికి వెన్నెముక
దేశ విదేశాంగ విధానానికి గతంలో వెన్నెముక లేదని, మోదీ తన హయాంలో వెన్నెముక కలిగిన విదేశాంగ విధానాన్ని రూపొందించారని అమిత్షా ప్రశంసించారు. మోదీ జర్నీని ప్రస్తావిస్తూ... స్థానిక స్థాయిలో పార్టీ కార్యకర్తగా కెరీర్ ప్రారంభించి బీజేపీ జాతీయ నేతగా ఎదిగారని, ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాయని, ఆ తర్వాత అత్యంత జనాకర్షణ కలిగిన ప్రధానిగా నిలిచారని తెలిపారు. మోదీ పనితీరును దగ్గరుండి చూసే అదృష్టం తనకు కలిగిందని కూడా చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో కలకలం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి