Brain Infection: కొత్తగా వెలుగులోకి అరుదైన బ్రెయిన్ వ్యాధి..ఇప్పటికే ముగ్గురు మృతి
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:52 PM
కేరళలో ఇటీవల అరుదైన మేనింజిటిస్ తరహా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు మూడు మరణాలు సంభవించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యాధి ఎలా వస్తుంది. దీని లక్షణాలు ఏంటనేది ఇక్కడ చూద్దాం.
కేరళలో ఇటీవల అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే అరుదైన వ్యాధి (Kerala brain infection) వెలుగులోకి వచ్చింది. ఈ మెదడు ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటివరకు మూడు మరణాలు సంభవించడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కేరళలో ఇప్పటివరకు 42 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధి ఎలా సోకింది, దీని లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అంటే ఏంటి?
అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనేది నేగ్లీరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వచ్చే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్. ఈ అమీబా సాధారణంగా కలుషితమైన నీరు, సరస్సులు, నదులు లేదా బాగా శుభ్రం చేయని కొలనులలో కనిపిస్తుంది. ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మెదడును ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. చాలా సందర్భాలలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
కేరళలో ఇటీవలి పరిస్థితి
కేరళలో ఈ ఇన్ఫెక్షన్ వల్ల మూడు మరణాలు నమోదయ్యాయి. అందులో ఒకటి కోజికోడ్ జిల్లాలోని ఓమస్సేరి నుంచి అబుబకర్ సిద్దీక్ అనే వ్యక్తి మూడు నెలల శిశువు, రెండోది మలప్పురం జిల్లాలోని కప్పిల్లో 52 ఏళ్ల రమ్లా అనే మహిళకు వచ్చింది. ఈ ఇద్దరూ కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇంతకు ముందు, ఆగస్టు 14న, తమరశ్శేరి నుంచి ఒక తొమ్మిదేళ్ల బాలిక కూడా ఈ ఇన్ఫెక్షన్తో మరణించింది. ప్రస్తుతం కోజికోడ్, మలప్పురం, వయనాడ్ జిల్లాల నుంచి ఎనిమిది మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ వ్యాధి ఎలా వస్తుంది?
ఆరోగ్య అధికారుల ప్రకారం అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ సాధారణంగా కలుషితమైన నీటిలో ఈత కొట్టడం లేదా స్నానం చేయడం ద్వారా వస్తుంది. వెచ్చని నీటిలో ఈ అమీబా సులభంగా బతుకుతుంది. ముక్కు ద్వారా ఈ అమీబా శరీరంలోకి చేరితే, అది మెదడుకు చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలిగిస్తుంది. కేరళలో ఈ ఏడాది 42 కేసులు నమోదవడంతో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.
లక్షణాలు ఏంటి?
ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా ఒకటి నుంచి ఏడు రోజులలో కనిపిస్తాయి
తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు లేదా వికారం
మెడ బిగుసుకుపోవడం, మానసిక గందరగోళం, కంటి దృష్టిలో మార్పులు
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి చాలా వేగంగా ముదిరిపోతుంది
జాగ్రత్తలు ఏంటి?
కేరళలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ కొన్ని నివారణ చర్యలు తీసుకుంటోంది. కోజికోడ్, వయనాడ్, మలప్పురం జిల్లాలలో బావులు, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేస్తున్నారు.
కలుషిత నీటిని నివారించండి. సరస్సులు, నదులు లేదా శుభ్రం చేయని కొలనులలో ఈత కొట్టడం మానేయండి
ఈత కొడుతున్నప్పుడు ముక్కు క్లిప్లు ఉపయోగించండి లేదా ముక్కును గట్టిగా మూసుకోండి
స్నానం లేదా ముఖం కడుక్కోవడానికి శుభ్రమైన, క్లోరినేటెడ్ నీటిని మాత్రమే ఉపయోగించండి
ఈ వ్యాధి గురించి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయండి
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి