Kapil Sharma-Nadiadwala Notice: బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ ఆధారంగా స్కిట్.. కపిల్ శర్మ షో ప్రొడ్యూసర్లకు నోటీసులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:33 PM
హెరా ఫెరీ మూవీ ప్రొడ్యూసర్ నాడియాడ్వాలా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ ఆధారంగా స్కిట్ రూపొందించి కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించారంటూ షో ప్రొడ్యూసర్లకు లీగల్ నోటీసులు జారీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో వ్యాఖ్యాత కపిల్ శర్మకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. హెరా ఫెరీ మూవీలోని బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ ఆధారంగా షోలో ఓ స్కిట్ చేసినందుకు మూవీ నిర్మాత ఫిరోజ్ నాడియాడ్వాలా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. కాపీ రైట్ నిబంధనల ఉల్లంఘనకు దిగినందుకు షో ప్రొడ్యూసర్, షోను స్ట్రీమ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తన అనుమతి లేకుండా బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ను తమ స్కిట్ కోసం వాడుకున్నారని ఆరోపించారు (Kapil Sharma show legal notice).
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు సంబంధించి త్వరలో విడుడల కానున్న ఎపిసోడ్లో బాబూరావ్ ఆప్టే క్యారెక్టర్ ఆధారంగా కికూ షర్దా ఈ స్కిట్ చేశారు. ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదల కావడంతో హెరా ఫెరీ నిర్మాత లీగల్ నోటీసులు జారీ చేశారు. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.25 కోట్లు డిమాండ్ చేశారు. ఈ వివాదానికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు (Baburao character infringement).
‘బాబూరావ్ ఆప్టే కేవలం ఒక మూవీ క్యారెక్టర్ కాదు. అది హెరా ఫెరీ మూవీకి ఆత్మ. మా శ్రమ, దార్శనికత, సృజనాత్మకతతో నిర్మించుకున్న సాంస్కృతిక వారసత్వం. పరేశ్ రావల్ తన మనసు పెట్టి ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఈ వారసత్వాన్ని కాపాడుకోవాలి. దీన్ని దుర్వినియోగం కానీయబోము’ అని ఫిరోజ్ నాడియాడ్ వాలా తన ప్రకటనలో తెలిపారు (Hera Pheri character rights).
కాపీరైట్ యాక్ట్-1957, ట్రేడ్మార్క్ యాక్ట్ సెక్షన్ -29 కింద ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఫిరోజ్ ఈ నోటీసులు జారీ చేశారు. బాబూరావ్ క్యారెక్టర్పై ట్రేడ్మార్క్ నాడియాడ్వాలా కుటుంబం పేరిట రిజిస్టరై ఉందని అన్నారు. ఈ క్యారెక్టర్పై పూర్తి హక్కులు తమవేనని అన్నారు. బాబూరావ్ ఆప్టేకు సంబంధించిన అన్ని భాగాలను నెట్ ఫ్లిక్స్ నుంచి, ఇతర సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని ఫిరోజ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇది పునరావృతం కానీయబోమని ప్రమాణపత్రం విడుదల చేయాలని, అధికారికంగా క్షమాపణలు చెప్పాలని 24 గంటల డెడ్ లైన్ విధించారు.
ఇవి కూడా చదవండి:
దసరా సందర్భంగా శూర్పణఖ దహనం.. పురుష హక్కుల సంఘం సంచలన ప్రకటన
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి