Jammu and Kashmir: కుప్వారాలో చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ABN , Publish Date - Sep 28 , 2025 | 03:29 PM
కెరాన్ సెక్టార్లో కాల్పులు కొనసాగుతుండటం, ఎల్ఓసీ వెంబడి వాతావరణ ప్రతికూలతల కారణంగా మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది. మిలిటెంట్లు ఎవ్వరూ తప్పించుకుపోకుండా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు ఆదివారం నాడు భగ్నం చేశాయి. పాకిస్థాన్ ఆక్రమిత భాగం నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించడంతో అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఇరువైపులా హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి.
కాగా, కెరాన్ సెక్టార్లో కాల్పులు కొనసాగుతుండటం, ఎల్ఓసీ వెంబడి వాతావరణ ప్రతికూలతల కారణంగా మృతదేహాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదని తెలుస్తోంది. మిలిటెంట్లు ఎవ్వరూ తప్పించుకుపోకుండా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బోర్డర్ బెల్ట్ వెంబడి తప్పించుకునేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను సీల్ చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు.
అతి సున్నితమైన చొరబాట్ల జోన్గా కెరాన్ సెక్టార్కు పేరుంది. శీతాకాలానికి ముందు రెండు నెలలూ ఉగ్రవాదులు ఈ జోన్ నుంచి చొరబాటు యత్నాలకు పాల్పడుతుంటారు. దీంతో క్రాస్-బోర్డర్ టెర్రరిజాన్ని నిరోధించేందుకు భద్రతా బలగాలు నిఘా ముమ్మరం చేస్తుంటాయి.
ఇవి కూడా చదవండి..
కరూర్ విషాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు టీవీకే
మళ్లీ భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం
For More National News And Telugu News