Ahmedabad Plane Crash: ప్రమాదానికి గురైన విమానంలో మాజీ సీఎం
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:01 PM
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని సెకన్లకే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 200 మందికిపైగా ప్రయాణికులు మరణించినట్లు వార్త కథనాలు వెలువడుతోన్నాయి.
గాంధీనగర్, జూన్ 12: గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో 200 మందికి పైగా ప్రయాణికులు మరణించారని సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం ఉన్నట్లు వార్తలు వెలువడుతోన్నాయి. మరోవైపు ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటన వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో నిఘా వర్గాలు విచారణ జరుపుతోన్నాయి.
కుమార్తె వద్దకు..
విజయ్ రూపాని కుమార్తె లండన్లో నివసిస్తున్నారు. ఆమెను కలిసేందుకు గురువారం ఉదయం విజయ్ రూపాని.. ఈ విమానంలో లండన్కు బయలుదేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కొన్ని నిమిషాల్లోనే..
గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు.. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్లైనర్ 787 విమానం 232 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో లండన్కు బయలుదేరింది. అలా బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానం ఎయిర్ పోర్ట్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకోగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది సైతం ఈ చర్యల్లో పాల్గొన్నారు.
కూలిపోయే ముందు..
ఇంకోవైపు ఈ విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు ఈ ఎయిర్ ఇండియా విమానం మేడే కాల్ జారీ చేసిందని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అన్ని విమాన సర్వీసులు రద్దు
విమాన ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్ట్లో విమాన ప్రయాణాలన్నింటిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. తదుపరి నోటీసులు జారీ చేసే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గుజరాత్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే విమాన ప్రయాణికులు గమనించి.. తమకు సహకరించాలని వారు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..
For National News And Telugu News