Amritsar-Saharsa Garib Rath Fire: గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:09 PM
అమృత్సర్-సహర్సా ఎక్స్ప్రెస్ రైల్లోని ఓ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగా బోగీ మొత్తం దగ్ధమైపోయింది. శనివారం శిర్హింద్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. పొగలు మొదలైన వెంటనే గుర్తించిన అధికారులు ప్రభావిత కోచ్లోని ప్రయాణికులను ఇతర కోచ్లకు తరలించారు. మంటల్లో చిక్కుకుని మూడు బోగీలు దెబ్బతిన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమృత్సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది (Garib Rath Train Fire Sirhind Station). పంజాబ్లోని అమృతసర్ నగరం నుంచి బయలుదేరిన రైల్లో శిర్హింద్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జీ-19 బోగీలో తొలుత పొగలు రావడాన్ని జీఆర్పీ అధికారి ఒకరు గుర్తించారు. ఈ క్రమంలో ఓ ప్యాసెంజర్ బోగీలోని చెయిన్ లాగి రైలును ఆపేశారు. ఆ తరువాత ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ఈ లోపు మంటల్లో చిక్కుకుని బోగీ మొత్తం తగలబడిపోయింది. సమీపంలోని మరో రెండు బోగీలకు కూడా మంటలు వ్యాపించడంతో అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు కోచ్లను రైలు నుంచి వేరు చేసిన సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలు ఆర్పేశారు.
ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయమైందని రైల్వే బోర్డు ప్రకటించింది. కాలిన గాయాలైన మహిళను (32) ఫతేగఢ్ సాహిబ్లోని సివిల్ ఆసుపత్రికి తరలించినట్టు శిర్హింద్ జీఆర్బీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్ లాల్ తెలిపారు. మంటలను గుర్తించిన వెంటనే అధికారులు ప్రభావిత కోచ్లల్లోని ప్రయాణికులను ఇతర కోచ్లకు తరలించారని తెలిపారు. మరి కాసేపట్లో రైలు యథాతథంగా ప్రయాణాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
మేహుల్ చోక్సీని స్వదేశానికి తరలించేందుకు బెల్జియం కోర్టు అనుమతి
బిహార్ ఎన్నికలు.. పర్దానషీన్ మహిళా ఓటర్ల కోసం ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి