Fastag Annual Pass: ఫాస్టాగ్ కొత్త వార్షిక పాస్కు సూపర్ రెస్పాన్స్.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:56 PM
దేశవ్యాప్తంగా రహదారులపై ప్రయాణం ఇప్పుడు మరింత వేగంగా కొనసాగుతోంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీసుకొచ్చిన కొత్త ఫాస్టాగ్ వార్షిక పాస్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేశంలో రహదారులపై ప్రయాణం మరింత సులభం, చౌకగా మారింది. ఎందుకంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటీవల ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్ (Fastag Annual Pass)కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఇది ఆగస్ట్ 15 నుంచి అమలులోకి వచ్చింది. మొదటి రోజే సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 1.4 లక్షల మంది ఈ పాస్ కొనుగోలు చేసి, యాక్టివేట్ చేశారు. అలాగే 1.39 లక్షల టోల్ లావాదేవీలు కూడా నమోదయ్యాయి.
సమస్యల పరిష్కారానికి..
దీన్ని బట్టి చూస్తే ఈ పాస్ ఎంత పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో రాజ్మార్గ్యాత్ర యాప్ని ఒక్కసారిగా 20,000-25,000 మంది యూజర్లు వినియోగించారు. ఈ పాస్ ఉన్నవాళ్లకి టోల్ ఫీజు జీరో అని చెప్పే SMSలు కూడా వస్తున్నాయి. దీని సమస్యల పరిష్కారం కోసం ప్రతి టోల్ ప్లాజాలో NHAI నోడల్ అధికారులను నియమించింది. వార్షిక పాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు వీరంతా సహాయం అందిస్తున్నారు. అలాగే వినియోగదారుల ఫీడ్బ్యాక్, సమస్యల పరిష్కారానికి 1033 హెల్ప్లైన్ను మరింత బలోపేతం చేశారు.
ఫాస్టాగ్ వార్షిక పాస్ అంటే ఏంటి?
గతంలో వాహనదారులు ప్రతి టోల్ గేట్ వద్ద కూడా ఆగి డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఫాస్టాగ్ ఇప్పుడు డిజిటల్గా మారింది. అంటే మీరు రూ. 3,000 చెల్లిస్తే, ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ట్రిప్పుల వరకు టోల్ ఫీజు లేకుండా ఎక్కడ ఆగకుండా ప్రయాణించవచ్చు. ఇది నాన్-కమర్షియల్ వెహికిల్స్ కోసం మాత్రమే వర్తిస్తుంది.
పాస్ ఎలా తీసుకోవాలి?
మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. తర్వాత మీరు Rajmargyatra యాప్లో లేదా NHAI అధికారిక వెబ్సైట్లో రూ. 3,000 చెల్లించి పాస్ను కొనుగోలు చేయవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత 2 గంటల్లో పాస్ యాక్టివేట్ అవుతుంది.
ప్రయోజనాలు ఏంటి?
టోల్ వద్ద ప్రతి సారి పేమెంట్ కోసం ఆగకపోవడం వల్ల ప్రయాణం చక్కగా సాగుతుంది. తరచూ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. వార్షికంగా తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అవుతాయి. ఒకే సారి చెల్లించి ఏడాది పాటు టెన్షన్ లేకుండా ప్రయాణించవచ్చు. ఇండియాలో ప్రస్తుతం 8 కోట్లకు పైగా FASTag యూజర్లు ఉన్నారు. టోల్ గేట్ల వద్ద 98 శాతం వరకు డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఈ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద వాహనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి