Earthquake in Assam: అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్లోనూ ప్రకంపనలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:16 PM
అస్సాంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది. పరిస్థితిని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు చురుకుగా సమీక్షిస్తున్నాయి.
డిస్పూర్: అస్సాం(Assam)లో ఆదివారం నాడు భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. ఉదల్గిరి జిల్లాకు 16 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని సంబంధిత అధికారులు గుర్తించారు. భూమికి 5 కిలోమీటర్ల లోతున ఇది సంభవించినట్టు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, భూటాన్లోనూ ప్రకంపనలు వచ్చాయి.
అస్సాంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది. పరిస్థితిని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు చురుకుగా సమీక్షిస్తున్నాయి. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని, తమ టీమ్లు అప్రమత్తంగా ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పరిస్థితిని సమీక్షిస్తున్నాం: సీఎం
ఉదల్ గిరిలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని తెలిపారు.
అస్సాంలో భూకంపం సంభవించిందని, ప్రజల భద్రత కోసం ప్రార్థిస్తున్నానని కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ సోమాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
14 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి