Kejriwal Mistakes: కేజ్రీవాల్ ఆ ఒక్క పని చేసుంటే.. ఢిల్లీ ఫలితం మరోలా ఉండేదా
ABN , Publish Date - Feb 09 , 2025 | 05:22 PM
ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య గట్టిపోటీలో.. కేజ్రీవాల్ పార్టీ మెజార్టీ మార్క్ చేరుకుంటారని అంతా అంచనావేశారు. కానీ చివరికి బీజేపీ అధికారానికి అవసవరమైన మెజార్టీ సాధించింది. కేజ్రీవాల్ ఓటమికి కారణాలు ఏమిటి.. ఆ ఒక్కపని చేసుకుంటే ఢిల్లీ ఫలితం మరోలా ఉండేదా.. కేజ్రీవాల్ చేసిన తప్పేంటి..

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆప్ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే ఆ పార్టీ ఓడిపోయిందని కొందరు చెబుతుంటే, లిక్కర్ స్కామ్, అవినీతి ఆరోపణల కారణంగా ఆప్ (AAP) అధికారాన్ని కోల్పోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీజేపీ (BJP) ప్లాన్ ప్రకారం ఢిల్లీలో గెలుపే లక్ష్యంగా పనిచేయడంతో పాటు.. యూనియన్ బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు కల్పించడంతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని విశ్లేషించేవారు లేకపోలేదు. ఇవ్వన్నీ ఒక ఎత్తైతే.. అసలు కేజ్రీవాల్ ఓడిపోవడానికి మరో కారణం ఉందనే చర్చ జరుగుతోంది. రాజకీయ వ్యూహాలు పన్నడంలో కేజ్రీవాల్కు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. ఢిల్లీ ఎన్నికల విషయంలో ఆయన వ్యూహాలు విఫలమైనట్లు తెలుస్తోంది. టికెట్ల కేటాయింపు విషయంలోనే కేజ్రీవాల్ ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. టికెట్ ఇవ్వని అభ్యర్థులను బుజ్జగించి ఉంటే ఢిల్లీ ఫలితం మరోలా ఉండేదనే చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ ఎవరిని బుజ్జగించి ఉండాల్సింది.. ఆప్ ఓటమికి అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం.
పోలింగ్కు ముందు బిగ్ షాక్..
కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్లకు సీట్లు నిరాకరించారు. అదే సమయంలో అసంతృప్తులను బుజ్జగించడంలో విఫలమయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న బీజేపీ ఆప్ అసంతృప్తి నేతలను పోలింగ్కు కొద్దిరోజుల ముందు తమ పార్టీలో చేర్చుకుంది. అప్పటికే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున ఇతర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారికి మద్దతుగా ఈ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. దీంతో గత ఎన్నికల్లో ఆప్ గెలుచుకున్న ఈ ఎనిమిది స్థానాలను ఈ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. అసంతృప్త నేతలను కేజ్రీవాల్ బుజ్జగించి ఉంటే, ఆ నేతలు పార్టీ మారే అవకాశాలు తక్కువుగా ఉండేవి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి ఉంటే ఢిల్లీ ఫలితం మరోలా ఉండి ఉండేదనే చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ చేతులారా 8 స్థానాలను వదులుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో 48 స్థానాలు బీజేపీ గెలుచుకోగా.. 22 స్థానాల్లో ఆప్ గెలిచింది. ఈ ఎనిమిది స్థానాలు ఆప్ గెలిచి ఉంటే 30 వరకు ఆప్ కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉండేవని, ఆ నేతల ప్రభావం పక్క నియోజకవర్గాల మీద ఉంటుందని, ఒకట్రెండు నియోజకవర్గాల్లో ఈనేతల ప్రభావం చూపించినా మెజార్టీ మార్క్కు ఆప్ దగ్గరగా వెళ్లే అవకాశం ఉండేదనే ప్రచారం జరుగుతోంది.
ఆ ఎనిమిది నియోజకవర్గాలు ఇవే..
గత ఎన్నికల్లో పాలెం, త్రిలోక్పురి, మాదీపూర్, కస్తూర్బానగర్, ఉత్తమ్ నగర్, బిజ్వాసన్, మెహ్రౌలీ, ఆదర్శ్నగర్ స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచారు. వీరికి ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ సీట్లు నిరాకరించారు. దీంతో భావన భావనా గౌర్, రోహిత్, గిరీష్ సోని, మదన్ లాల్, రాజేష్ రిషి, బిఎస్ జూన్, నరేష్ యాదవ్, పవన్ శర్మలు పోలింగ్కు ముందు బీజేపీలో చేరారు. కమలం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం బీజేపీకి కలిసొచ్చింది. ఈ ఎనిమిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేజ్రీవాల్ చేతులారా 8 సీట్లను వదులుకున్నారని, దీంతో ఆప్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి