Share News

Air India Flight: మూడు గంటలపాటు గాలిలో ఎగిరి చివరకు..

ABN , Publish Date - Oct 22 , 2025 | 01:08 PM

ప్రముఖ ఎయిర్ ఇండియా విమాన సంస్థ ప్రయాణికులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే మిలాన్ నుంచి న్యూఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందంటూ చివరి నిమిషంలో చెప్పింది.

Air India Flight: మూడు గంటలపాటు గాలిలో ఎగిరి చివరకు..

ముంబై, అక్టోబర్ 22: ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో విమానాన్ని వెనక్కి మళ్లించి.. సురక్షితంగా బయలుదేరిన ఎయిర్ పోర్టులోనే ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన తాజాగా ముంబైలో చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి 1.15 గంటలకు ముంబై ఎయిర్ పోర్టు నుంచి అమెరికా న్యూజెర్సీలోని నెవార్క్ నగరానికి ఏఐ 191 విమానం ప్రయాణికులతో బయలుదేరింది. కొన్ని గంటల తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. ఈ విషయాన్ని ముంబై ఏటీసీకి తెలియజేశారు. ఎయిర్ పోర్ట్ అధికారుల సూచన మేరకు ఈ ఎయిర్ ఇండియా విమానం ఈ తెల్లవారు జామున 5.30 గంటలకు ముంబై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దిగింది.


ఈ విమానంలో ఏర్పడిన సమస్యను గుర్తించేందుకు సాంకేతిక బృందం రంగంలోకి దిగిందని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ఈ విమాన ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అంత వరకు ఈ విమాన ప్రయాణికులు ముంబైలో ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


మరోవైపు ఎయిర్ ఇండియా విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీపావళి వేడుకలు తమ వారితో జరుపుకోవాలని ఇటలీ మిలాన్‌లోని భారతీయులు భావించారు. ఆ క్రమంలో భారత్ వెళ్లేందుకు అక్టోబర్ 17వ తేదీన ఎయిర్ ఇండియా విమానాన్ని వారు బుక్ చేసుకున్నారు. అయితే ఈ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని చివరి నిమిషంలో ప్రకటించింది. దీంతో ఈ విమాన సర్వీసును రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. అది కూడా చివరి నిమిషంలో చెప్పడంతో ఎయిర్ ఇండియా సంస్థపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక ఈ నెల ఆరంభంలో వియన్నా నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సైతం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ఈ విమాన సర్వీస్‌ను దుబాయ్‌కు మళ్లించిన విషయం విదితమే. పలుమార్లు తనిఖీల అనంతరం ఈ విమాన సర్వీస్ భారత్‌కు బయలుదేరింది.

ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం..

For More National News And Telugu News

Updated Date - Oct 22 , 2025 | 01:27 PM