Share News

karthika Masam: కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:25 PM

పరమ శివుడిని అత్యంత ఇష్టమైన మాసం కార్తీకం. ఈ మాసంలో నాలుగు పనులు చేస్తే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో ప్రతి రోజు ఒక పర్వదినమే. దీంతో ఈ మాసంలో వచ్చే పర్వదినాలు..

karthika Masam: కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

కార్తీక మాసంలో ప్రతి రోజు పుణ్య దినమే. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలతో జన్మజన్మల పాపాలు సైతం తొలగి పోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ఏడాదంతా దీపారాధన చేయకున్నా.. ఈ ఒక్క నెలలో అది కూడా కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించడం వల్ల పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో తప్పకుండా చేయవలసినవి.. దీపారాధన, కార్తీక స్నానం, ఉపవాసంతోపాటు తులసీ కల్యాణం.


దీపారాధన..

ఈ మాసంలో ఇంటిలోని పూజ గదిలో దీపం వెలుగుతూ ఉండాలి. ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యి దీపారాధన వల్ల మంచి జరుగుతుంది. ఉసిరికాయలతో సైతం దీపాలు వెలిగించవచ్చు. ఈ మాసంలో ప్రతి రోజూ సాయంత్రం ఎవరైతే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో.. వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. లక్ష్మీ దేవికి ఉసిరి కాయ ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో ఉసిరి దానం చేసినా.. ఈ చెట్టు కింద భోజనం చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతాయి.


సముద్ర లేదా నదీ స్నానం..

కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడాన్ని కార్తీక స్నానమంటారు. సముద్రంలో కానీ, నదిలో కానీ స్నానమాచరించాలి. ఆ సమీపంలోని దేవాలయంలో దైవాన్ని దర్శించి.. దీపం వెలిగించాలి. అలాగే నదుల్లో దీపాలు వెలిగించి వదలాలి. నదులకు వెళ్ల లేని వారు.. ఇంట్లో ఉదయాన్నే స్నానమాచరించి.. దైవాన్ని పూజించి అనంతరం దీపారాధన చేయాలి. అనంతరం ఇంటి ముందున్న తులసి కోట వద్ద దీపాలను వెలిగించాలి. అలాగే దగ్గర్లోని గుడికి వెళ్లి దీపాలు వెలిగించాలి. ఈ మాసంలో ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ద ఏకాదశి లేదా పౌర్ణమి వరకు ఈ స్నానాలు ఆచరించ వచ్చని పురాణాలు పేర్కొంటున్నాయి.


ఉపవాసం..

కార్తీక మాసంలో చేసే ప్రతి పనికి అర్థం పరమార్థం ఉంటుంది. అందులో ఒకటి ఉపవాసం. ఈ మాసంలో ఇష్టదైవాన్ని తలుచుకుని ఉపవాసం చేయడం ఎంతో మంచిది. ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ సైతం చెబుతుంది. ఈ మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలి. దీనిని నక్తమ్ అంటారు. ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహంతోపాటు ఆరోగ్యం సైతం కలుగుతుంది.


తులసీ కల్యాణం..

క్షీరాబ్ది ద్వాదశి ముహూర్తంలో 32 వేల మంది దేవతలతో శ్రీమహా విష్ణువు లక్ష్మీ సమేతుడై.. తులసి దాత్రివనంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కృతయుగంలో క్షీరసాగర మథనం చేసిన రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. పాల సముద్రాన్ని చిలికిన కారణంగా చిలుక ద్వాదశి అని కూడా అంటారు.


ఈ మాసంలో ముఖ్య దినాలు.. పండుగల వివరాలు ..!

అక్టోబర్ 22: గోవర్దన్ పూజ, అన్నకూట్ (ఉత్తరాదిలో జరుపుకొంటారు)

అక్టోబర్ 23: భాయ్ దూజ్, యమ ద్వితీయ

అక్టోబర్ 25: నాగుల చవితి

అక్టోబర్ 26: నాగ పంచమి

అక్టోబర్ 27: కార్తీక సోమవారం, స్కంద షష్టి, ఛత్ పూజ


అక్టోబర్ 29: బుధ అష్టమి వ్రతం

అక్టోబర్ 30: గోపాష్టమి

అక్టోబర్ 31: అక్షయ నవమి

నవంబర్ 1: ఏకాదశి, కంస వధ

నవంబర్ 2: యోగేశ్వర ద్వాదశి


నవంబర్ 3: కార్తీక సోమ ప్రదోష వ్రతం

నవంబర్ 4: మణికర్ణిక స్నానం

నవంబర్ 5: కార్తీక పూర్ణిమ, గురునానక్ జయంతి

నవంబర్ 8: సంకష్టహర చతుర్థి

నవంబర్ 10: కార్తీక సోమవారం

నవంబర్ 17 :కార్తీక సోమవారం

నవంబర్ 18: మాస శివరాత్రి

నవంబర్ 20: కార్తీక మాసం చివరి రోజు

ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

రాష్ట్రపతికి తప్పిన ప్రమాదం..

For More Devotional News And Telugu News

Updated Date - Oct 22 , 2025 | 01:17 PM