Air India Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: బ్లాక్ బాక్స్లోని డేటా డౌన్లోడ్
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:10 PM
అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్లోని డేటా డౌన్లోడ్ అయిందని కేంద్రం వెల్లడించింది. అందులోని డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ, జూన్ 26: అహ్మదాబాద్లో కుప్పకూలి దగ్ధమైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్తోపాటు కాక్ పిట్ వాయిస్ రికార్డర్కు సంబంధించిన డేటా డౌన్లోడ్ ప్రక్రియ ముగిసిందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ప్రస్తుతం ఆ డేటాను విశ్లేషిస్తున్నామని తెలిపింది. అయితే విమాన ప్రమాదంలో బ్లాక్బాక్స్తోపాటు కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో వాటిలోని డేటా బయటకు తీయటం కష్టతరంగా మారింది. దీంతో కేంద్రం వాటిని అమెరికాకు పంపి.. అందులోని డేటాను వెలికి తీసే ప్రయత్నాలను చేపట్టిందంటూ పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. కానీ, వాటిలోని మొత్తం డేటాను సురక్షితంగా వెలికి తీయడంలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విజయం సాధించింది. దీంతో ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు మరికొన్ని రోజుల్లో ప్రజలకు తెలియనున్నాయి.
జూన్ 12వ తేదీ మధ్యాహ్నం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఆ విమానం బీజే హాస్టల్పై కూలిపోయి.. దగ్ధమైంది. ఈ ప్రమాదలో ఒకరు మినహా మిగిలిన 241 మంది మరణించారు. విమాన సిబ్బంది 12 మంది మృతి చెందారు. హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో 34 మంది విగత జీవులయ్యారు. ఈ ఘటన అనంతరం బ్లాక్ బాక్స్ హాస్టల్ భవనంపై దొరికింది. అలాగే కాక్ పిట్ వాయిస్ రికార్డర్ శిథిలిలా కింద లభ్యమైంది. అయితే ఇవి దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో వీటిలోని డేటాను సురక్షితంగా వెలికి తీయగలమా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాంటి వేళ.. వీటిలోని డేటాను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) వెలికి తీసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
రిజర్వేషన్లు అమలు చేసి.. ఎన్నికలు నిర్వహించాలి
For More National News and Telugu News