Share News

Amarnath Yatra: ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు..

ABN , Publish Date - Jul 05 , 2025 | 11:48 AM

అమరనాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Amarnath Yatra: ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు..

అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. యాత్రికులకు సంబంధించిన ఐదు బస్సులు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం 36 మంది యాత్రికులకు గాయాలైనట్లు తెలిసింది. బస్సుల్లో ఒకదానికి బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.


యాత్రికుల (Amarnath pilgrims) బస్సులు జమ్మూ-శ్రీనగర్ (Jammu-Srinagar) జాతీయ రహదారిలోని చందర్‌కూట్ సమీపానికి చేరుకోగానే.. వాటిలో ఓ బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. చందర్‌కూట్ లాంగర్ సైట్ వద్దకు రాగానే కాన్వాయ్‌లోని చివరి వాహనం నియంత్రణ కోల్పోయి.. నిలబడి ఉన్న (Bus accident) వాహనాలను ఢీకొట్టింది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్తున్న కాన్వాయ్‌లో ఈ బస్సులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 36 మంది యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే నాలుగు వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.


గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తంరాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. యాత్రికులందరినీ వేరే వాహనాల్లో తరలించారు. ఇదిలావుండగా, జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. మొదటి దఫాగా మొత్తం 5,880 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. ఈ యాత్రకు వెళ్లే భక్తులు గతంలో పహల్గాం, బాల్తాల్‌ మార్గాల మీదుగా వెళ్లేవారు. అయితే పహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. ఈ రెండు మార్గాలను అధికారులు నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు.

Updated Date - Jul 05 , 2025 | 12:13 PM