Trains Cancelled: భారీగా రైళ్లు రద్దు.. అధికారులు ఆకస్మిక నిర్ణయం
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:25 AM
రైల్వే అధికారులు ఆకస్మాత్తుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు రైల్వే సర్వీసులను రద్దు చేశారు. ఆ జాబితాలో 22 రైళ్లు ఉన్నాయి.
జమ్మూ, ఆగస్టు 27: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. జమ్మూ ప్రాంతం తీవ్ర అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో నార్తరన్ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఈ డివిజన్లో నడిచే 22 రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ రైలు సర్వీసులు జమ్మూ, కట్రా రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరవలసి ఉందన్నారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ భారీ వర్షాల కారణంగా మంగళవారం.. 27 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
మరోవైపు పటాన్కోట్ నుంచి హిమాచల్ప్రదేశ్లోని కండ్రోరీ వెళ్లే రైల్ సర్వీసులను సైతం రద్దు చేశారు. అలాగే ఫిరోజ్పూర్, మండా, పటాన్కోట్లకు వెళ్లే రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే కాట్రా - శ్రీనగర్ మధ్య నడిచే రైల్వే సర్వీసులు కొనసాగుతున్నాయని డివిజనల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఇక సోమవారం నుంచి జమ్మూ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ దశాబ్దంలో ఇంతలా వర్షాలు కురవడం ఇదే తొలి సారి. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో మరణించారు. అలాగే పలు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. రహదారులు నాశనమైనాయి. బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి.
అలాగే జనవాసాలతోపాటు వ్యవసాయ భూములు సైతం వరద నీటి ప్రవాహంలో మునిగాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వాధికారులు బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్క జమ్మూ నగరంలోని ఒకే రోజు.. 250 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అగ్నిప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు
For National News And Telugu News