Uttarakhand: నదిలో పడిన బస్సు.. ఒకరు మృతి.. ప్రయాణికులు గల్లంతు
ABN , Publish Date - Jun 26 , 2025 | 09:39 AM
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ నదిలోకి బస్సు దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం మేరకు అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
నైనిటాల్, జూన్ 26: ఉత్తరాఖండ్ రుద్ర ప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరో 11 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు, పోలీసులతోపాటు రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ఏడుగురు ప్రయాణికులను రక్షించారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులున్నారని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. అందుకోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. అయితే ప్రమాద సమయంలో బస్సు వేగంగా వెళ్తోందని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. మరోవైపు నదిలో నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పాకిస్థాన్పై మరోసారి నిప్పులు చెరిగిన రక్షణ మంత్రి
మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి
For More National News and Telugu News