Israeli hostages: రెండేళ్ల తర్వాత విముక్తి.. బందీలను విడుదల చేసిన హమాస్
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:39 PM
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో దాని ఫలితాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులకు ఇవాళ విముక్తి లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్- హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో దాని ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులకు ఇవాళ (సోమవారం) విముక్తి లభించింది. శాంతి ఒప్పందంలో భాగంగా తొలుత ఏడుగురు బందీలను రెడ్క్రాస్కు అప్పగించిన హమాస్.. ఆ తర్వాత కాసేపటికే మిగతా 13 మంది బందీలను విడిచిపెట్టింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వారందరినీ రెడ్క్రాస్ సభ్యులు వాహనాల్లో ఇజ్రాయెల్కు తీసుకెళ్లారు. ఇక, హమాస్ వద్ద ఉన్న 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను కూడా హమాస్ త్వరలోనే అప్పగించనుంది.
ఇదిలా ఉండగా, 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ 1200 మందిని హత్య చేసి, 251 మందిని అపహరించింది. వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించగా, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని హమాస్ ఇప్పుడు విడిచిపెట్టింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ఒప్పందం తొలిదశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో బందీల విడుదల ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఈ ఒప్పందం కింద తమ వద్ద ఉన్న మొత్తం 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. అయితే, ఇందులో 20 మందే సజీవంగా ఉండటంతో వారిని విడుదల చేసింది. ప్రతిగా 2వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తోంది ఇజ్రాయెల్. దీంతో ఇంతకాలం బందీలుగా శిక్ష అనుభవించిన తమ వాళ్లు తిరిగి వస్తుండడంతో ఇరుదేశాల కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే
సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News