Bilawal Bhutto: ఉగ్రవాద సంస్థలతో పాక్ సంబంధాలను ఒప్పుకున్న బిలావల్
ABN , Publish Date - May 02 , 2025 | 03:29 PM
తీవ్రవాదంతో పాకిస్థాన్కు గత చరిత్ర ఉన్న విషయం నిజమేనని, ఫలితంగా పాక్ నష్టపోయిందని, ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకుందని బిలావల్ చెప్పారు. అయితే ఇదంతా ముగిసిన అధ్యాయమని, సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టామని చెప్పారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు గతంలో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న విషయాన్ని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto) అంగీకరించారు. టెర్రరిస్టు గ్రూపులకు గతంలో పాక్ మద్దతుగా నిలవడం, నిధులు ఇవ్వడాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంగీకరించడాన్ని బిలావల్ తాజాగా సమర్ధించారు.
Canada Election 2025: ఎన్నికల్లో 22 మంది పంజాబీ ఎంపీలు ఘన విజయం
తీవ్రవాదంతో పాకిస్థాన్కు గత చరిత్ర ఉన్న విషయం నిజమేనని, ఫలితంగా పాక్ నష్టపోయిందని, ఆ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకుందని బిలావల్ చెప్పారు. అయితే ఇదంతా ముగిసిన అధ్యాయమని, సమస్య పరిష్కారానికి అంతర్గత సంస్కరణలు చేపట్టామని చెప్పారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని, అయితే ఇండియా తమను రెచ్చగొడితే యుద్ధానికి సిద్ధమేనని మీర్పూర్ ఖాస్లో జరిగిన పబ్లిక్ ర్యాలీలో బిలావల్ తెలిపారు.
''పాకిస్థాన్ శాంతియుత దేశం. ఇస్లాం శాంతిని మాత్రమే కోరుకుంటుంది. మేము యుద్ధం కోరుకోం. అయితే మా సింధుపై దాడి జరిగితే యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. యుద్ధాన్ని మేము స్వాగతించం, కానీ రెచ్చగొడితే ఐక్యంగా గర్జిస్తాం" అని అన్నారు.
పాకిస్థాన్ చాలాకాలంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, శిక్షణ, మద్దతు ఇస్తుండటంపై ''స్కై న్యూస్'' ఇంటర్వ్యూలో అడిగిన ఒక ప్రశ్నకు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల సమాధానమిస్తూ, అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసం మూడు దశాబ్దాలు చాలా చెత్త పనులన్నీ చేశామని, అయితే అది పొరపాటని అర్ధమమైందని చెప్పారు. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే పాక్కు తిరుగులేని రికార్డు ఉండేదని అన్నారు.