Prostate cancer: చాపకింద నీరులా.. ప్రోస్టేట్ క్యాన్సర్
ABN , Publish Date - May 27 , 2025 | 08:27 AM
పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే.. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రధానంగా 70 ఏళ్లు పైబడిన ఈ వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుండగా... అసలీ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి, దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి.
- 70 ఏళ్లు దాటితే అప్రమత్తత అవసరం
- తరచూ మూత్రం.. వ్యాధి ప్రధాన లక్షణం
- ప్రాథమిక దశలో ప్రోస్టేట్ తొలగింపు
- ముదిరిన దశల్లో హార్మోన్ థెరపీ
హైదరాబాద్ సిటీ: మన దేశంలో ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate cancer) చాపకింద నీరులా విస్తరిస్తోంది. 70ఏళ్లు దాటిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. పరీక్షలతో ముందే గుర్తించే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో ఈ తరహా క్యాన్సర్ లక్షణాలేవీ బయటపడవు. అవి కనిపించేసరికే వ్యాధి బాగా ముదిరిపోతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ విషయంలో ఇదే జరిగింది. ఆయనకు మూత్రవిసర్జన సరిగా కాకపోవడం, నడుం నొప్పి రావడంతో పరీక్ష చేయించుకోగా ప్రోస్టేట్ క్యాన్సర్గా గుర్తించారని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సిరందాస్ అరుణ్ తెలిపారు. 82 సంవత్సరాల వయసులో నాలుగో దశ క్యాన్సర్ గుర్తించారన్నారు.
మన దేశంలో ఇలా..
ప్రోస్టేట్ క్యాన్సర్ మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి లక్ష మందిలో సగటున 9 మందికి ఇది వస్తుంది. ఢిల్లీలో 12.4 మందికి, ఈశాన్య రాష్ట్రాల్లో ముగ్గురికే ఇది కనిపిస్తోంది. 2012-16 మధ్యకాలంలో హైదరాబాద్ జిల్లా క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం, ప్రతి లక్ష మందిలో 5.5 మందికి ప్రోస్టేట్ క్యాన్సర్ సోకుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇది మధ్యస్థ స్థాయిలో ఉంది. ఏఐఎన్యూకు వచ్చే ఈ కేసుల్లో 60 నుంచి 70 శాతం ప్రాథమిక దశల్లోనే ఉంటాయి. 30 నుంచి 40 శాతం మాత్రమే ముదిరిన దశలో ఉంటాయి.
45 ఏళ్ల నుంచి పరీక్ష
అమెరికా ప్రమాణాల ప్రకారం 70 ఏళ్లు దాటిన పురుషులు పీఎస్ఏ పరీక్ష అక్కర్లేదని చెబుతారు. అదే మన దేశంలో అయితే 45 ఏళ్ల నుంచి, కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే 50 ఏళ్ల నుంచే ఆ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. క్యాన్సర్ ఏ దశలో ఉందన్న దాన్ని బట్టి దానికి చికిత్స ఉంటుంది. ప్రాథమిక దశల్లో అయితే ప్రోస్టేట్ను పూర్తిగా తొలగిస్తే చాలావరకు సరిపోతుంది. అదే ముదిరిన దశల్లో అయితే వ్యాధి మరింత విస్తరించకుండా ఉండేందుకు హార్మోన్ థెరపీ కూడా చేయాల్సి ఉంది.

లక్షణాలు ఇలా..
‘ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాల్లో ప్రధానమైనది రాత్రిపూట తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఇది సరిగ్గా రాకపోవడం, మూత్రం లేదా వీర్యంలో రక్తం కనపడడం, దానికి వెళ్లి వచ్చినా ఇంకా కడుపు కొంత ఉబ్బరంగానే అనిపించడం. 90 శాతంకేసుల్లో మాత్రం ప్రాథమిక దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవన్నారు. పెద్దవయసు వాళ్లు మూత్ర సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, అవగాహన, త్వరగా పరీక్ష చేయించుకోవడం, సమయానికి చికిత్స చేయించుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండొచ్చు’.
పరీక్ష వెయ్యి లోపే..
కేవలం రూ. 800 నుంచి రూ. వెయ్యిలోపు ఖర్చయ్యే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (పీఎ్సఏ) అనే రక్తపరీక్ష చేయంచుకుంటే 6 నుంచి 8 గంటల్లోపు ఫలితం వస్తుంది. ఇది చాలావరకు ప్రాణాలు కాపాడుతుంది. పీఎస్ఏ స్థాయి ఎక్కువగా ఉంటే అప్పుడు ఎంఆర్ఐ లేదా ప్రోస్టేట్ బయాప్సీ లాంటి పరీక్షలు చేయించుకోవాలి
- డాక్టర్ సిరందాస్ అరుణ్
ఈ వార్తలు కూడా చదవండి.
Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!
Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి
Read Latest Telangana News and National News