Jubilee Hills By Election: ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు తథ్యం: టీపీసీసీ చీఫ్
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:54 PM
బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ పార్టీదే విజయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. మాగంటి గోపినాథ్ తల్లి ఆవేదనకు కేటీఆర్ జవాబు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే గోపినాథ్ కుమారుడు సంధించిన ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పాలని కేటీఆర్కు సూచించారు. నవీన్ యాదవ్పై ఒక్క కేసును బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చూపిస్తే తాను దేనికైనా సిద్ధమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
హైదరాబాద్, నవంబర్ 09: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. నవీన్ యాదవ్ 30 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలువబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. జూబ్లీ హిల్స్ ప్రజల కష్టాలు పంచుకునే నాయకుడు నవీన్ యాదవ్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్గూడలో విలేకర్లతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్ఎస్ అరాచక పాలనకు.. రెండేళ్ల అభివృద్ధి పాలనకు బేరీజు వేసుకొని ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని పేర్కొన్నారు.
కొన్ని చానల్స్తో ఫేక్ సర్వేలు చేయించుకొని బీఆర్ఎస్ కుట్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని బలి చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎన్ని కుప్పి గంతులు వేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. తమ ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో 15 వేల రేషన్ కార్డులు ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధితోపాటు సంక్షేమానికి పట్టం కట్టబోతున్నారని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ నేతలు పొర్లు దండాలు పెట్టిన గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే అని స్పష్టం చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం చూసి విపక్షాలలో వణుకు పుడుతోందని చెప్పారు. సినీ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా హమీ ఇచ్చారు. నియంతృత్వ పాలన, అవినీతి భరించ లేక అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు చీకొట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ది రాలేదని మండిపడ్డారు.
15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చేసిన అభివృద్ధి జూబ్లీ హిల్స్లో ఎక్కడ కనిపించడం లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో లోపాయికారి గుట్టు.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సైతం నడుస్తుందన్నారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ మైత్రి తెలియనిది కాదని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషనులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. దీనికి బీజేపీ అడ్డుపడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ పార్టీదే విజయమని పునరుద్ఘాటించారు. మాగంటి గోపినాథ్ తల్లి ఆవేదనకు కేటీఆర్ జవాబు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే గోపినాథ్ కుమారుడు సంధించిన ప్రశ్నలకు సైతం సమాధానం చెప్పాలని కేటీఆర్కు సూచించారు. నవీన్ యాదవ్పై ఒక్క కేసును బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చూపిస్తే తాను దేనికైనా సిద్ధమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పరాకాష్టకు చేరిన సీఎం రేవంత్ మూర్ఖత్వం: జగదీష్ రెడ్డి
పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..
For More TG News And Telugu News