JNTU: జేఎన్టీయూ ఆచార్యుల్లో టెన్షన్... టెన్షన్
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:48 AM
జేఎన్టీయూలో పనిచేస్తున్న ఆచార్యుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద అర్హులైన ఆచార్యులకు పదోన్నతుల ప్రక్రియను జేఎన్టీయూ చేపట్టింది. దీంతో ఆచార్యుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
- రేపటితో ముగియనున్న పదోన్నతుల ఇంటర్వ్యూలు
- రీసెర్చ్ ప్రాజెక్టులపై ప్రశ్నలకు బిక్కమొహం
హైదరాబాద్ సిటీ: కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద అర్హులైన ఆచార్యులకు పద్నోతుల ప్రక్రియను జేఎన్టీయూ(JNTU) చేపట్టింది. ఈ మేరకు రెండ్రోజులగా వివిధ విభాగాలకు చెందిన ఆచార్యులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, గురువారంతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూల్లో వివిధ ఎన్ఐటీలు, ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీల నుంచి వచ్చిన సబ్జెక్టుల నిపుణులు తమదైన స్థాయిలో ప్రశ్నాస్త్రాలు సంధించి అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశారు.
ప్రధానంగా ఒక ప్రొఫెసర్గా పరిశోధనకు ఇస్తున్న ప్రాధాన్యత, ఆయా విభాగాల్లో ప్రారంభించిన రీసెర్చ్ ప్రాజెక్టులు, వివిధ సదస్సుల్లో సమర్పించిన రీసెర్చ్ పేపర్స్ గురించి సబ్జెక్టు నిపుణులు గుచ్చిగుచ్చి అడగడంతో సగానికి పైగా ప్రొఫెసర్లు సమాధానాలు చెప్పలేక బిక్కమొహం వేసుకొని బయటికి వచ్చినట్లు వర్సిటీ వర్గాల్లో హాట్హాట్గా చర్చ జరుగుతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు చెందిన అభ్యర్థులు కాస్తోకూస్తో తమ రీసెర్చ్ వర్క్ను ప్రజెంట్ చేయగా, ఇంజనీరింగ్ విభాగాల నుంచి ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో కొందరికి ఇంటర్వ్యూ గదిలో రీసెర్చ్.. అనిపేరు వినగానే ఏంచెప్పాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలిసింది.

దశాబ్ద కాలంగా రీసెర్చ్ ప్రాజెక్టుల కన్నా రెమ్యునిరేషన్ వచ్చే పోస్టుల్లో కొనసాగేందుకే మొగ్గు చూపారని, తీరా సీఏఎస్ ఇంటర్వ్యూలో రీసెర్చ్పై అడిగిన ప్రశ్నలకు వారంతా దిక్కులు చూడాల్సి వచ్చిందని చర్చ జరుగుతోంది. మొత్తంగా సగానికిపైగా అభ్యర్థుల పెర్ఫార్మెన్స్ పట్ల సబ్జెక్టు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేయగా, వర్సిటీ ఉన్నతాధికారులు ఎలాగోలా వారికి మార్కులు వేసి గట్టెక్కించాలని బతిమాలుకోవాల్సి వచ్చిందిని సమాచారం. గురువారంతో ఇంటర్వ్యూలు పూర్తిచేసి, నెలాఖరులోగా అర్హులైన వారికి ప్రమోషన్ లెటర్లు ఇచ్చే అవకాశం ఉందని ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొన్న ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి, వెండి.. మళ్లీ పెరిగాయిగా.. నేటి ధరలు ఇవీ
Read Latest Telangana News and National News