Dasara Utsavam On Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:00 AM
అమ్మలగమ్మయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
విజయవాడ, సెప్టెంబర్ 21: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన శ్రీదుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభం కానున్నాయని దేవాలయం ఈవో శీను నాయక్ వెల్లడించారు. ఆదివారం విజయవాడలోని దేవాలయంలో వైదిక కమిటీ సభ్యులతోపాటు స్ధానాచార్య శివప్రసాద్ శర్మతో కలిసి ఈవో శీను నాయక్ దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ను విడుదల చేశారు.
అనంతరం ఈవో శీనూ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయని వివరించారు. ఈ పదకొండు రోజుల్లో 11 అవతారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారని చెప్పారు. ఈ ఉత్సవాల్లో తొలి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు అమ్మ వారు దర్శనమివ్వనున్నారని పేర్కొన్నారు.
ఈ దసరా ఉత్సవాలు.. అక్టోబర్ 2 వ తేదీన పూర్ణాహుతితో ముగియనున్నాయని వివరించారు. అదే రోజు సాయంత్రం 5.00 గంటలకు కృష్ణా నదిలో హంస వాహన తెప్పోత్సవం జరగనుందని తెలిపారు. ఇక సెప్టెంబర్ 29వ తేదీన మూల నక్షత్రం రోజు.. మధ్యాహ్నం 3:30 నుండి 4:30 మధ్య సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు.
దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు ఈవో శీనూ నాయక్ వెల్లడించారు.
దసరా ఉత్సవాలు.. అమ్మవారి అవతారాలు..
23వ తేదీ గాయత్రీ దేవి..
24వ తేదీ అన్నపూర్ణాదేవి..
25వ తేదీ కాత్యాయని దేవి..
26వ తేదీ మహాలక్ష్మి..
27వ తేదీ శ్రీలలితా త్రిపుర సుందరి దేవి..
28వ తేదీ శ్రీమహా చండి దేవి..
29వ తేదీ శ్రీ సరస్వతి దేవి..
30వ తేదీ శ్రీ దుర్గాదేవి..
అక్టోబర్ 1వ తేదీ శ్రీమహిషాసుర మర్దిని దేవి..
2వ తేదీ శ్రీరాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దుర్గమ్మ వారు దర్శనమివ్వనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏం చేసినా కలిసి రావడం లేదా?.. మహాలయ అమావాస్య రోజు..
దసరాతో దశ తిరగనున్న రాశులు ఇవే..
For More Devotional News And Telugu News