Hyderabad: పెళ్లి ఇంట్లో భారీ చోరీ..
ABN , Publish Date - Feb 14 , 2025 | 07:53 AM
పెళ్లికి సహకరించాలని, పిలిచిన యజమాని ఇంటికే కన్నం వేశారు.. ఇంట్లో యజమాని లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ కేసులో ముఠాకు చెందిన ముగ్గురు నేరస్థులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు.

- బంగారు నగలు, డైమండ్స్, సొత్తుతో పనివాళ్లు పరారీ
- జీఆర్పీ సహకారంతో రైలులో గుర్తింపు
- నిందితులను వెంటాడి పట్టుకున్న పోలీసులు
- రూ. 5 కోట్ల విలువైన నగలు, నగదు స్వాధీనం
- ఓ హత్య కేసులో నిందితుడిగా గుర్తింపు
హైదరాబాద్ సిటీ: పెళ్లికి సహకరించాలని, పిలిచిన యజమాని ఇంటికే కన్నం వేశారు.. ఇంట్లో యజమాని లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా నగలు, నగదు దోచుకెళ్లారు. ఈ కేసులో ముఠాకు చెందిన ముగ్గురు నేరస్థులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకడు గత ఏడాది జరిగిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నగర సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గ్యాంగ్స్టర్ నయీం అనుచరుడు శ్రీహరిపై కేసు
హిమాయత్నగర్లో వ్యాపారి రోహిత్ కేడియా కుటుంబం ఉంటోంది. ఆయన కుమార్తె వివాహం సందర్భంగా వీరి వద్ద గతంలో వంటవాడిగా పనిచేసి మానేసిన బిహార్కు చెందిన సుశీల్ ముఖియాను పిలిపించాడు. పెళ్లి సందర్భంగా పనులు ఎక్కువగా ఉండటంతో సుశీల్ తన సహాయం కోసం అంటూ వెస్ట్బెంగాల్కు చెందిన బసంతి ఆర్తీని, ఢిల్లీలో ఉంటున్న మోహ్లూ ముఖియాను పనివాడిగా చేర్చుకున్నాడు. వీరు ముగ్గురూ చోరీకి పథకం వేశారు. కేడియా కుటుంబం పెళ్లి పనుల్లో భాగంగా దుబాయ్ వెళ్లడంతో.. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి తర్వాత ముగ్గురు ఇంట్లో ఉన్న బంగారు, డైమండ్ నగలు, నగదు చోరీ చేసి పరారయ్యారు. ఈ విషయం గుర్తించిన కేడియా వద్ద పనిచేస్తున్న అభయ్ కేడియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీ కేసును సీరియ్సగా తీసుకున్న సీపీ వెంటనే టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
సీసీ పుటేజీల జల్లెడ..
వ్యాపారి రోహిత్ కేడియా ఇంట్లో 16 మంది వరకు పనివాళ్లు ఉన్నారు. సెక్యూరిటీతోపాటు నాలుగు కుక్కలు కూడా ఉన్నాయి. కొత్తవారు ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో పనిచేసేవారే చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానించారు. ముందస్తుగా కుక్కలను కట్టేసి ఉంటారని భావించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ముగ్గురు పనివాళ్లు బ్యాగులు తీసుకొని వెళుతున్న దృశ్యాలను గుర్తించారు. అయితే, వారు తమవద్ద పనిచేస్తున్న పనివాళ్లని కేడియా చెప్పడంతో వారికోసం పోలీసులు వేట ప్రారంభించారు.
జీఆర్పీ అధికారుల సాయంతో..
నిందితులు చోరీ సొత్తు తీసుకొని రైల్వే స్టేషన్కు వెళ్లి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు మూడు పోలీస్ బృందాలు భోపాల్, నాగ్పూర్, పాట్నాకు చేరాయి. నిందితులు రైలులో ఉండటంతో జీఆర్పీ అధికారుల సాయంతో రైలు బోగీలను జల్లెడ పట్టారు. నాగపూర్ సమీపంలో ఓ బోగీలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.5 కోట్ల విలువైన 710 గ్రాముల డైమండ్ నగలు, 1.420 కిలోల బంగారు నగలు, 215 గ్రామలు వెండి, రూ.19.36లక్షల నగదుతోపాటు విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సమన్వయంతో పనిచేసి నిందితులను పట్టుకున్న సిబ్బందికి సీపీ రివార్డులు అందించారు.
నిందితులు బిహార్ చెందినవారు..
నిందితులు బిహార్ ముధుబని జిల్లా బీరుల్ గ్రామానికి చెందిన వారు. నేపాల్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామంలో వారంతా చోరీలు చేయడంలో సిద్దహస్తులు. వీరు ధనవంతుల ఇళ్లలో పనివారిగా చేరి యజమాని నమ్మకం సంపాదిస్తారు. ఇంట్లో నగలు, డబ్బులు ఎక్కడ పెడతారో గుర్తిస్తారు. యజమానులు ఇంట్లో లేని సమయంలో పథకం ప్రకారం దోచేస్తారు. ఎవరైనా అడ్డుకుంటే వారిని చంపేందుకు కూడా వీరు వెనుకాడరు. గత ఏడాది దోమలగూడలో జరిగిన వృద్ధురాలి హత్య, దోపిడీ కేసులో ప్రస్తుతం పట్టుబడ్డ నిందితుడు మోహ్లూ ముఖియా నిందితుడు. ఇతనిపై ఢిల్లీలో మరో రెండు చోరీ కేసుల్లో ఉన్నాయి. పోలీసులు టెక్నాలజీ వినియోగిస్తున్న సంగతి గుర్తించిన నేరగాళ్లు ఫోన్లు వాడకుండా ఉంటున్నారు. తప్పించుకొని తిరిగేందుకు నిందితుల్లో ఒకడు తన భార్యకు గత రెండేళ్లుగా ఫోన్కూడా చేయలేదు. - సీవీ ఆనంద్, నగర సీపీ
ఈవార్తను కూడా చదవండి: ప్రమాణాలు పాటించకుండా ఇండిగో ఎయిర్లైన్స్కు ఆహార పదార్థాలు!
ఈవార్తను కూడా చదవండి: సంజయ్, కిషన్రెడ్డి.. కోతల రాయుళ్లు
ఈవార్తను కూడా చదవండి: ఎస్సీలలోని అన్ని కులాలకు తహసీల్దార్ ద్వారానే కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలి
ఈవార్తను కూడా చదవండి: Mini Jatara.. మేడారంలో కొనసాగుతున్న మినీజాతర
Read Latest Telangana News and National News