Khammam News: మద్యానికి డబ్బులివ్వలేదని...
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:35 PM
నవ మాసాలు మోసి.. కనీపెంచి పోషించిన తల్లికి అండగా ఉండాల్సిన ఆ కుమారుడు విచక్షణ మరిచిపోయాడు. మద్యానికి బానిసై కన్నబంధాన్ని మరిచి దారుణంగా తల్లినే హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో జరిగింది.
- గొడ్డలితో దాడి చేసి తల్లిని హతమార్చిన కొడుకు
- తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ఘటన
ఖమ్మం: నవ మాసాలు మోసి.. కనీపెంచి పోషించిన తల్లికి అండగా ఉండాల్సిన ఆ కుమారుడు విచక్షణ మరిచిపోయాడు. మద్యానికి బానిసై కన్నబంధాన్ని మరిచి దారుణంగా తల్లినే హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన ఖమ్మం(Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలివీ.. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన మందుల భూబా(50) వ్యవసాయకూలీ పనిచేస్తూ జీవిస్తోంది.
కొన్నేళ్ల క్రితం భర్త మృతిచెందగా.. కుమారుడు మధుకు పెళ్లి చేసింది. అతడి ప్రవర్తన బాగా లేకపోవడంతో భార్య రెండేళ్లక్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. రేచీకటి సమస్య ఉన్న మధు మద్యానికి బానిసై తరచూ తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి 9గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మధు తల్లిని మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో భూబా ఇంటి ఎదురుగా ఉన్న జామచెట్టుకిందకు వెళ్లి కూర్చోగా.. మధు(Madhu) ఆమెపై గొడ్డలితో దాడిచేయగా ఆమె మృతిచెందింది.
ఆ తర్వాత మధు ఇంట్లోకి వెళ్లి నిద్రించాడు. అయితే సోమవారం ఉదయం 6గంటల సమయంలో నిద్రలేచిన మధు తాను రాత్రి తల్లితో గొడవపడ్డానని, ఆమె విగతజీవిగా పడిఉందని తమ ఇంటి సమీపంలో ఉండే తన మేనమామ నల్లగట్టు కాశయ్యకు వివరించాడు. దీంతో కాశయ్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముదిగొండ సీఐ మురళి, తిరుమలాయపాలెం ఎస్ఐ కూసుపుడి జగదీష్ అక్కడికి వివరాలు సేకరించారు. భూబా మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. నిందితుడు మధును అదుపులోకి తీసుకున్నారు. కాశయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్స్టేషన్లు
Read Latest Telangana News and National News