Hyderabad: అమ్మో.. రూ. 88.82 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 10:05 AM
ట్రాయ్.. ప్రైవేట్ మొబైల్ ఫోన్ నెట్వర్క్లు.. ఆర్బీఐ.. తదితర ప్రభుత్వ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నా సైబర్ నేరగాళ్ల మాయలో అమాయకులు పడిపోతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధుడి వద్ద రూ.80.64 లక్షలు, ఆన్లైన్ పార్ట్టైం జాబ్ ఆఫర్ అంటూ రూ. 8.18 లక్షలు స్వాహా చేసిన ఘటనలు వెలుగు చూశాయి.
హైదరాబాద్ సిటీ: ట్రాయ్.. ప్రైవేట్ మొబైల్ ఫోన్ నెట్వర్క్లు.. ఆర్బీఐ.. తదితర ప్రభుత్వ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నా సైబర్ నేరగాళ్ల మాయలో అమాయకులు పడిపోతూనే ఉన్నారు. డిజిటల్ అరెస్టు(Digital arrest) పేరుతో ఓ వృద్ధుడి వద్ద రూ.80.64 లక్షలు, ఆన్లైన్ పార్ట్టైం జాబ్ ఆఫర్ అంటూ రూ. 8.18 లక్షలు స్వాహా చేసిన ఘటనలు వెలుగు చూశాయి. హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడ వాసి బ్యాంకు రిటైర్డు ఉద్యోగి(83)కి ఇటీవల ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు.
‘మీ నంబర్ బ్లాక్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ‘మయన్మార్, ఫిలిప్పీన్స్, కంబోడియా వంటి దేశాలకు అక్రమంగా మానవ రవాణా చేసినట్లు కేసులు నమోదయ్యాయని క్రైమ్ బ్రాంచి పోలీసులు చెప్పార’’ని వీడియో కాల్లో పోలీసు డ్రెస్సుల్లో ఉన్న వారిని ఢిల్లీ పోలీసులుగా పరిచయం చేశాడు. ‘హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు తేలడంతో మిమ్ముల్ని డిజిటల్ అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింద’ని నకిలీ లెటర్ చూపించారు. ‘మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే మీ ఖాతాల్లోని డబ్బు ఆర్బీఐ ఖాతాకు బదిలీ చేయండి.

అడిట్ చేసి మీకు ఏ సంబంధం లేదని తేల్చి, తిరిగి మీ ఖాతాల్లో మీ డబ్బు జమ చేస్తాం. అప్పటి వరకూ మీరు డిజిటల్ అరెస్టులో ఉంటారు. ఈ విషయం ఇంట్లో ఎవరికైనా చెబితే మాకు వెంటనే తెలుస్తుంది. కఠిన జైలుశిక్షతోపాటు భారీగా జరిమానా విధిస్తారు’ అని బెదిరించారు. వారు చెప్పిన ఖాతాలోకి ఆర్టీజీఎస్ ద్వారా రూ.80.64 లక్షలు జమ చేశాడు. తర్వాత ఫోన్ చేస్తే కాల్ కట్ చేయడంతో సైబర్ మోసమని బాధితుడు గుర్తించి సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పార్ట్టైం జాబ్.. పెట్టుబడి పేరుతో..
పార్ట్టైం ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతుకుతున్న చాంద్రాయణగుట్ట(Chandrayangutta) యువకుడు(21)తో ఈ నెల 9న దివ్యా మెహతా అనే మహిళ వాట్సాప్ చాటింగ్ చేసి, చెగ్ ఇండియా రిక్రూటింగ్ మేనేజర్నని పరిచయం చేసుకున్నది. ‘మీ ప్రొఫైల్కు తగినట్లు గూగుల్ ఆన్లైన్ ఆడిటర్ ఉద్యోగం ఉంది. ఇంట్లో నుంచే మొబైల్ ఫోన్ నుంచి రోజూ రూ.3,000-5,000 మధ్య సంపాదించొచ్చు’ అని నమ్మించింది.
ముందు లింక్ల ద్వారా కొన్ని రెస్టారెంట్ల వివరాలు పంపి.. వాటికి 5 స్టార్ రేటింగ్ ఇస్తే రూ.150 చొప్పున ఇవ్వడంతోపాటు మరో వ్యక్తిని సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని పరిచయం చేసింది. పెట్టుబడితే ఎక్కువ లాభాలొస్తాయని నమ్మించడంతో బాధితుడు తొలుత రూ.1000 పెట్టుబడి పెడితే రూ.1,410 రావడంతో పలు దఫాలుగా వేర్వేరు ఖాతాలకు రూ. 8.18 లక్షలు బదిలీ చేశాడు. పెట్టుబడితోపాటు పని చేసిన డబ్బు ఇవ్వాలని బాధితుడు కోరిగా.. మరో రూ. 3 లక్షలు డిపాజిట్ చేస్తే డబ్బు ఇస్తామనడంతో మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News