Chennai News: ‘ఆన్లైన్’ వ్యాపారంలో నష్టం.. కుమారుడిని హతమార్చి తండ్రి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:39 PM
ఆన్లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో, ఏడేళ్ల కుమారుడి గొంతు నులిమి హతమార్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, గొంతు కోసిన స్థితిలో ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా వున్నాయి...
- ప్రాణాపాయ స్థితిలో భార్య
చెన్నై: ఆన్లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో, ఏడేళ్ల కుమారుడి గొంతు నులిమి హతమార్చిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడగా, గొంతు కోసిన స్థితిలో ఆయన భార్య ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. వివరాలిలా వున్నాయి... అన్నానగర్ 18వ మెయిన్ రోడ్డులోని అపార్ట్మెంట్లో నివసిస్తున్న నవీన్ కన్నన్ (38) తేనాంపేటలోని కేంద్ర ప్రభుత్వ అకౌంటింగ్ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్గా, ఆయన భార్య నివేదిత (34) పెరంబూర్లోని దక్షిణ రైల్వే లోకో కార్యాలయంలో అధికారిగా పనిచేస్తున్నారు.
ఈ దంపతులకు లివిన్ (7) అనే కుమారుడున్నాడు. నవీన్ కన్నన్ తల్లి భువనేశ్వరి, తండ్రి కూడా వీరితో ఉంటున్నారు. నవీన్ కన్నన్ సోమవారం బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత తల్లికి ఫోన్ చేసి గదిలో భార్యా, కుమారుడు నిద్రపోతున్నారని, వారిని కదిలించవద్దని చెప్పాడు. కొద్దిసేపటి తరువాత భువనేశ్వరికి నివేదిక తల్లి ఫోన్ చేసింది. తన కుమార్తె ఫోన్ తీయడం లేదేమని అడిగింది. దీంతో అనుమానించిన భువనేశ్వరి నివేదిక గదిలోకి వెళ్లి చూసి, దిగ్ర్భాంతికి గురైంది.

అక్కడ లివిన్ నిశ్చలంగా పడివుండగా, నివేదిక గొంతు కోయబడి, రక్తపు మడుగులో మంచంపై పడి వుంది. దీంతో భువనేశ్వరి చుట్టుపక్కల వారిని పిలిచి కోడల్ని, మనవడ్ని కీల్పాక్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే లివిన్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న తిరుమంగళం పోలీసులు కేసు నమోదుచేసి నవీన్ కన్నన్ కోసం గాలించారు. అంతలో, ఉదయం 11 గంటలకు విల్లివాక్కం-కొరట్టూరు శతాబ్ది ఎక్స్ప్రెస్ కింద పడి నవీన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది.
దాంతో అతడి మృతదేహాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవీన్పై పలు అవినీతి ఫిర్యాదులున్నాయని, అతను ఆన్లైన్ వ్యాపారంలో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అప్పుల బాధ తాళలేకే అతను కొడుకు, భార్యను హత్య చేసి, తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News