Ananthapuram News: నేను ఏసీబీ ఇన్ఫార్మర్ను మాట్లాడుతున్నా.. రూ. లక్ష ఇవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:30 PM
నేను ఏసీబీ ఇన్ఫార్మర్ను మాట్లాడుతున్నా.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. ఏసీబీ సీఐ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని పలువురిని బెదిదిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- అనంతపురం ఏడీఏకి బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు
- గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన సురేష్ అరెస్టు
అనంతపురం: తాను ఏసీబీ ఇన్ఫార్మర్నంటూ బెదిరింపులకు దిగాడు గార్లదిన్నె మండలం కోటంకకు చెందిన సురేష్. ఏకంగా ఏసీబీ సీఐ హమీద్ ఖాన్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. దందాకి తెరలేపాడు. వ్యవసాయ శాఖ అనంతపురం ఏడీ అల్తాఫ్ అలీఖాన్ను బెదిరించాడు. ఈనెల 6వ తేదీన ఏడీఏకి ఫోన్ చేసి, తాను ఏసీబీ ఇన్ఫార్మర్నంటూ పరిచయం చేసుకున్నాడు. ‘నువ్వు ఏం ఏం చేస్తున్నావో అన్నీ తెలుసు... ఎన్ఆర్ ఫర్టిలైజర్స్ కేసులో డబ్బు తీసుకుని సీజ్ చేసిన మూడు ఆటోలను వదిలేశావ్.. డబ్బు ఇవ్వకపోతే ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానం’టూ ఏడీఏను బెదిరించాడు.
నిబంధనల మేరకు 6ఏ కేసు నమోదు చేశామనీ... ఆటోలు ఇంకా రిలీజ్ కాలేదని ఏడీఏ సమాధానం చెప్పగా... ఆటోలను వదిలిపెట్టలేదా అంటూ దబాయించాడు. ఆటోల రిలీజ్ అంశం కోర్టు పరిధిలో ఉందని ఏడీఏ చెప్పగా... అంతా తనకు తెలుసుననీ, ఎన్ఆర్ ఫర్టిలైజర్స్పై మళ్లీ తనిఖీలు చేయాలని రుబాబు ప్రదర్శించాడు. ‘నీవు ఏం చేస్తున్నావో.. అన్నీ నాకు తెలుసు.
రూ.లక్ష డబ్బు ఇస్తే సరి.. లేదంటే వ్యవసాయ శాఖ కమిషనర్, జేడీఏ, ఏసీబీ అధికారులకు నీ గురించి ఫిర్యాదు చేస్తా’ అని బెదిరించాడు. ఇలా రోజూ వాట్సాప్ కాల్స్ చేస్తూ బెదిరిస్తూనే ఉన్నాడు. దీంతో విసిగిపోయిన ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్, బుధవారం ఉదయం టూటౌన్ పోలీసు స్టేషన్కు వెళ్లి, సీఐ శ్రీకాంత్ యాదవ్కు ఫిర్యాదు చేశాడు. సీఐ.. సిబ్బందిని పంపి నిందితుడిని అరెస్టు చేశారు. ఏడీఏ విధులకు ఆటంకం కలిగించడం, బెదిరించడంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆది నుంచీ వివాదాస్పదుడే...!
సురేష్ ఆది నుంచీ వివాదాస్పదుడిగా పేరు పొందాడు. నాలుగేళ్ల క్రితం ఓ ప్రైవేటు పురుగుల మందుల కంపెనీలో పనిచేసేవాడు. రైతుల నుంచి డబ్బు తీసుకుని, డీలర్లకు చెల్లించకపోవడంతో అతడిని తొలగించినట్లు సమాచారం. ఆ తర్వాత ఓ ఎరువుల దుకాణంలో పనిచేశాడు. అక్కడ పలు వివాదాలతో దుకాణ యజమాని.. అతడిని బయటకు పంపినట్లు తెలిసింది. డబ్బుల కోసం ఓ డీలర్, పలువురిని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అతడిపై గతంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఓ కేసు నమోదైనట్లు తెలిసింది. ప్రస్తుతం అనంతపురంలో అతడు నివాసం ఉంటున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
Read Latest Telangana News and National News