Ganesh Chaturthi Boosts: గణేష్ చతుర్థితో దేశంలో ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరిగిందంటే..
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:59 AM
గణేష్ చతుర్థి అంటే కేవలం భక్తి, సంతోషాల పండుగ మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఓ అద్భుతమైన ఉత్సవమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. ఈ పండుగ ద్వారా ఈ ఏడాది వేల కోట్ల వ్యాపారం జరిగినట్లు చెప్పింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశంలో గణేష్ చతుర్థి (Ganesh Chaturthi 2025) అంటే రంగు రంగుల పందిళ్లు, డీజే మోతలు, భక్తితో కూడిన ఉత్సాహం గుర్తుకొస్తాయి. కానీ ఈ పండగ కేవలం భక్తి, సంస్కృతి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊపు తెచ్చిందని చెప్పవచ్చు.
ఎందుకంటే ఈ ఏడాది గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు రూ. 45,000 కోట్ల వ్యాపారాన్ని తెచ్చిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. గత ఏడాది రూ.25,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలిపింది. ఈసారి పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అనేక వ్యాపార రంగాలకు మేలు జరిగిందని చెప్పింది.
విగ్రహాలే రూ. 1000 కోట్ల వ్యాపారం
CAIT జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా చెప్పినట్లు, గణేష్ చతుర్థి సమయంలో ఒక్క గణపతి విగ్రహాల వ్యాపారమే రూ. 1000 కోట్లకు పైగా జరిగింది. అంతేకాదు పుష్పాలు, దండలు, కొబ్బరికాయలు వంటి అవసరమైన సామగ్రి కొనుగోళ్లు మరో రూ. 500 కోట్ల బిజినెస్ అయ్యింది. ఇక మోదకాలు, ఇతర స్వీట్ల డిమాండ్ ద్వారా రూ. 2,000 కోట్లను దాటేసింది. పండగ సమయంలో కేటరింగ్, స్నాక్స్ సర్వీసులు రూ. 3,000 కోట్ల వ్యాపారాన్ని సృష్టించాయి.
పందిళ్లతో రూ. 10,000 కోట్ల ఖర్చు
ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేష్ పందిళ్లు ఏర్పాటయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే 7 లక్షల పందిళ్లు, కర్ణాటకలో 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్లలో ఒక్కో చోట 2 లక్షల చొప్పున పందిళ్లు వెలిశాయి. ఒక్కో పందిరికి కనీసం రూ. 50,000 ఖర్చు చేసినా, అలంకరణలు, ఏర్పాట్లు, పూజల కోసం మొత్తం రూ. 10,000 కోట్లకు పైగా ఖర్చయిందని భారతియా వెల్లడించారు.
టూరిజం, రిటైల్కు ఊపు
గణేష్ చతుర్థి కేవలం పూజలు, పందిళ్లతోనే ఆగలేదు. ఈ పండగ స్థానిక టూరిజం, బస్సులు, క్యాబ్లు, రైళ్ల వ్యాపారాలకు రూ. 2,000 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. బట్టలు, ఆభరణాలు, హోమ్ డెకర్, గిఫ్ట్ ఐటెమ్ల రిటైల్ వ్యాపారం రూ. 3,000 కోట్లకు చేరింది. పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి.
ఎకానమీకి గణపతి బూస్ట్
గణేష్ చతుర్థి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చిందని CAIT సెక్రటరీ జనరల్ ఎమెరిటస్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. రక్షా బంధన్తో మొదలైన పండగల సీజన్ గణేష్ చతుర్థి, నవరాత్రులు, దసరా, కర్వా చౌత్, దీపావళి, ఛత్ పూజ ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్తో భారత ఆర్థిక వ్యవస్థ ఊపందుకోనుందని CAIT అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి