YCP Political Terrorism: వైసీపీ మార్క్ పొలిటికల్ టెర్రరిజం
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:09 AM
ఓసారి జగన్ ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకుంటే.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం.. మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ.. ప్రకృతి వనరులకు చెర.. విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా.. అంతులేని అవినీతి, కమీషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఎన్నో అరాచకాలు.
సంఘ విద్రోహులు, నేరస్తులకు అండ
జైలుకు వెళ్లి మరీ జగన్ పరామర్శలు
రౌడీషీటర్ల కుటుంబాలకు భరోసా
రాజకీయ రౌడీయిజానికి ప్రోత్సాహం
పోలీసులపై తిరగబడాలంటూ పిలుపు
సెల్యూట్ కొట్టిస్తానంటూ వ్యాఖ్యలు
అదే బాటలో ఆ పార్టీ నేతల వ్యవహారం
సొంత మీడియాలో విద్వేషాలకు బీజం
రాజధాని మహిళలపై నీచ వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టేందుకు జగన్ అండ్ కో కుట్ర
అమరావతి నిర్మాణం, పెట్టుబడులు అడ్డుకునేలా ఉగ్రవాద రాజకీయం
అభివృద్ధిని చూసి ఓర్వలేక..
వైసీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రౌడీయిజం లేదు.. అడ్డగోలు దోపిడీ లేదు.. సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు కనపడవు.. దారుణమైన బూతులు వినపడవు.. కూటమి ప్రభుత్వం కష్టపడి ఏడాదిలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చింది. బడా నేతలు, అధికారులు.. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించినవారిపై చర్యలు తీసుకుంటోంది. తప్పు చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించడంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. రాజధాని అమరావతి పనులు మళ్లీ పట్టాలెక్కాయి. మళ్లీ అభివృద్ధి కనిపిస్తోంది. ఇదంతా ఇష్టం లేని జగన్ రాజకీయ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. చట్టప్రకారం పనిచేస్తున్న పోలీసులపై తిరగబడాలని పిలుపిస్తున్నారు. రౌడీలకు మద్దతు ఇస్తున్నారు. ప్రతిదీ రాజకీయం చేస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. కులమతాలను లాగుతున్నారు. రాష్ట్రాన్ని మరో బిహార్, ఉత్తరప్రదేశ్లా మార్చాలని చూస్తున్నారు.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు
‘పోలీసులకు ఎదురు తిరగండి. రేపు మనం అధికారంలోకి వచ్చాక వారితోనే సెల్యూట్ చేయిస్తా’ - జగన్
తెనాలిలో కానిస్టేబుల్పై దాడి చేసిన రౌడీ షీటర్ల కుటుంబాలకు జగన్ పరామర్శ. రౌడీలు అమాయకులంటూ సర్టిఫికెట్
జగన్ రోత మీడియా డిబేట్లో అమరావతిని ‘వేశ్యల రాజధాని’ అంటూ మహిళల్ని తీవ్రంగా అవమానించేలా వ్యాఖ్యలు
నిందితులను కార్లో కూర్చోబెట్టుకుని మాజీ మంత్రి విడదల రజని పోలీసులపైనే చిందులు
యూనిఫామ్లో ఉన్న పోలీసులపై పళ్లు కొరుకుతూ ఏమి చేస్తావ్ అంటూ రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఓసారి జగన్ ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకుంటే.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నాశనం.. మద్యం, ఇసుకలో అడ్డగోలు దోపిడీ.. ప్రకృతి వనరులకు చెర.. విచ్చలవిడిగా గంజాయి, ఎర్రచందనం రవాణా.. అంతులేని అవినీతి, కమీషన్లు, దందాలు, సెటిల్మెంట్లు, దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఎన్నో అరాచకాలు. రాష్ట్రంలో ‘స్వేచ్ఛ’ అన్నదే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడలేని భయానక వాతావరణం. జగన్ అరాచక పాలనను భరించలేకే ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక నాటి ‘దారుణాలు’ దాదాపుగా లేవు. ఏడాదిలోనే పాలనను దాదాపుగా గాడిలో పెట్టారు. తప్పు చేయాలంటే నేరస్తులు భయపడాలని, శాంతిభద్రతలు కాపాడాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని.. లేదంటే ప్రగతి అసాధ్యమని పలుమార్లు సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు స్పష్టంగా చెప్పారు. పోలీసులు చట్టప్రకారం వ్యవహరిస్తుండటంతో సంఘ విద్రోహ శక్తులతో పాటు గతంలో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తోకముడిచారు. సోషల్ మీడియాలో ఓ అనుచిత పోస్టు పెట్టాలంటే భయపడే పరిస్థితి. మరోవైపు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపైనా దృష్టిపెట్టింది. పోలవరం సహా గతంలో ఆగిపోయిన పలు ప్రాజెక్టులకు మళ్లీ శ్రీకారం చుట్టింది. రోడ్లకు మహర్దశ తీసుకువచ్చింది. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలో నడుస్తుంటే.. సహించలేని వైసీపీ మూక విద్వేషాలు రెచ్చగొడుతోంది. ఇందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా ప్రేరేపిస్తున్నారు. తప్పు చేసినవారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే.. పోలీసులకు ఎదురు తిరగండంటూ జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మనం అధికారంలోకి వచ్చాక వారితోనే సెల్యూట్ చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా వదలనంటూ పోలీసులకు వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. గతంలో అరాచకాలకు పాల్పడి అరెస్టయిన వైసీపీ నేతలను జగన్ జైలుకు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఇక ఆ పార్టీ నేతలూ నేరస్తులకు కొమ్ముకాస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన విడుదల రజనీ, అంబటి రాంబాబు వంటి వారు పోలీసుల పట్ల అనుచితంగా వ్యవహరించారు.
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన నేరగాళ్లు.. జగన్ అండ చూసుకుని మళ్లీ బుసకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నిచోట్ల అధికార టీడీపీ వారిపైనే దాడులకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్లు పెడుతున్నారు. పనిలో పనిగా నోటికి కూడా పని చెబుతున్నారు. చివరకు అమరావతిని ‘వేశ్యల రాజధాని’ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేసే వరకూ పరిస్థితి వచ్చింది. జగన్ ఇస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో రౌడీయిజం వ్యవస్థీకృతంగా మారే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు చట్టపరంగా వ్యవహరిస్తుండటంతో జీర్ణించుకోలేని వైసీపీ.. సోషల్ యాక్టివిస్టుల స్వేచ్ఛపై దాడి అంటూ పెడబొబ్బలు పెడుతోంది. జగన్ సొంత మీడియాలో ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా వ్యతిరేక విషబీజాలు నింపే కార్యక్రమానికి జోరు పెంచింది. గతంలో హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు పెట్టించి వారి ఆచూకీ దొరకలేదని సీఐడీతో చెప్పించిన ఘనత వైసీపీకి ఉంది. మళ్లీ అలాంటి పరిస్థితులు తీసుకువచ్చేలా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు.
సోషల్ సైకోలకు వణుకు
కూటమి ప్రభుత్వం వచ్చాక సోషల్ సైకోలకు వణుకు మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశంతో పోలీసులు రూటు మార్చారు. సోషల్ మీడియా ద్వారా సమాజంపై విషం చిమ్ముతున్న వైసీపీ సోషల్ మీడియా విషవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించివేశారు. తల్లి, చెల్లి అనే ఉచ్ఛనీచాలు లేకుండా దారుణ వ్యాఖ్యలు చేసే వర్రా రవీంద్ర రెడ్డి మొదలు వందలాది మంది వైసీపీ సైకోలను జైలుకు పంపారు. అత్యంత జుగుప్సాకరమైన మార్ఫింగ్ వీడియోలు తయారు చేసిన సైబర్ నేరగాళ్లకు చట్టం ఎలా ఉంటుందో చూపించారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి అయినా.. అధికార పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ అయినా హద్దు మీరితే కూటమి ప్రభుత్వంలో చూస్తూ ఊరుకోబోమని పోలీసులు నిరూపించారు.
అరాచక, అవినీతి శక్తులకు సంకెళ్లు
గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి ఇసుక అక్రమ తరలింపు, మైనింగ్ దోపిడీ వరకూ.. రాజకీయ అరాచకాల నుంచి రౌడీల బెదిరింపులు, సోషల్ మీడియాలో సైకోల వేధింపులన్నీ అరికట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అధునాతన టెక్నాలజీ అందిపుచ్చుకుని నేర నియంత్రణలో దేశానికే ఏపీ పోలీసు ఆదర్శంగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. అరాచకాలకు పాల్పడిన వల్లభనేని వంశీ, బూతులకు బ్రాండ్ అంబాసిడర్ అయిన పోసాని కృష్ణమురళి, అనిల్ బూరగడ్డ, మైనింగ్ దోచుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి, దౌర్జన్యాలకు పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, నందిగం సురేశ్ తదితరులను కూటమి ప్రభుత్వం జైలుకు పంపింది. అలాగే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న సీనియర్ ఐపీఎస్ పీఎ్సఆర్ ఆంజనేయులు, దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులైన జగన్ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఓఎ్సడీ కృష్ణమోహన్ రెడ్డి ఇతర అధికారులను అరెస్ట్ చేయించింది. గంజాయిపై ఉక్కుపాదం మోపిన ఏపీ పోలీసులు ‘ఈగల్’ను రంగంలోకి దించారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి’ బృందాలు, శక్తి యాప్, వాట్సాప్ సహకారంతో మహిళా ఐజీ నేతృత్వంలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నేర నియంత్రణకు డ్రోన్లను సైతం వాడుతున్నారు. శిక్షల శాతం పెరగడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందిపుచ్చుకోవడం లాంటి చర్యలతో నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు.
ఇరాక్లో ఐసిస్.. ఏపీలో వైసిస్
గత ఐదేళ్ల జగన్ పాలనలో అభివృద్ధి అన్నది రాష్ట్రంలో ఎక్కడా కనపడకుండా చేశారు. అధికారంలోకి రావడానికి కోడికత్తి డ్రామా, గొడ్డలి పోటు నాటకం, అబద్ధాలు, విద్వేషాలు.. అధికారంలోకి వచ్చాక పగలు, ప్రతీకారాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో భయానక పాలన సాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పరిస్థితి గాడిన పడటం చూసి ఓర్వలేని జగన్ ‘పొలిటికల్ టెర్రరిజం’ ప్రేరేపిస్తున్నారు. ‘ఇరాక్లో ఐసి్సలా.. ఏపీలో వైసిస్’ తయారవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇరాక్లో పురుడు పోసుకున్న ‘ఐసిస్’ అనే చాందసవాద సంస్థ తమ రాజ్యస్థాపన, విస్తరణే లక్ష్యంగా చేయని అరాచకం లేదు. ఐసి్సకు మతోన్మాద ఉగ్రవాదం అజెండా అయితే.. ఇడుపులపాయలో పుట్టిన వైసీపీకి రాజకీయ ఉగ్రవాదం అజెండా అని విమర్శిస్తున్నారు.