Weekly Train: తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలు..
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:32 AM
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.
తిరుపతి: తిరుపతి, సాయినగర్ షిర్డీ.. ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య అనుసంధానం పెరిగేలా, భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలును ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మంగళవారం కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్గా ప్రారంభించగా, తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. అదే సమయంలో తిరుపతిలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ,

తుడా మాజీ చైర్మన్ జి.నరసింహయాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు, రైల్వే సీఈ సూర్యనారాయణ, స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, డిప్యూటీ సీఈ వామనమూర్తి, సీపీఆర్వో ఎ.శ్రీధర్, ఎస్ఎంఆర్ డాక్టర్ కె.చిన్నప రెడ్డి, ఐపీఎఫ్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఎన్నో రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నామని, ప్రధానంగా విజయవాడ- గూడూరు మధ్య మూడో రైలు మార్గం పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి సోమన్న వెల్లడించారు.

తిరుపతి రైల్వే స్టేషన్(Tirupati Railway Station) అభివృద్ధి పనులు రూ.312 కోట్లతో జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి జనార్దన్రెడ్డి తెలిపారు. తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్, గూడూరు-రేణిగుంట మూడవ లైను, నడికుడి - శ్రీకాళహస్తి రైలు మార్గాల పనులు జరుగుతున్నాయని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News