Minister Sandhya Rani: కార్తీకమాసంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి..
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:32 PM
కాశిబుగ్గ విషాదాన్ని రాజకీయంగా వాడుకోవాలనే వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని సంధ్యారాణి మండిపడ్డారు. ఇటువంటి మానవీయ విషాదంలో రాజకీయాలు చేయడం తీవ్రమైన అనైతిక చర్య అని పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం: కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని మంత్రి సంధ్యారాణి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్తీకమాసంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మన్యం జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భక్తుల ప్రాణనష్టం కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఘటనా అనంతరం ప్రభుత్వం అత్యవసర చర్యలు, గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించిదని పేర్కొన్నారు.
ఈ విషాదాన్ని రాజకీయంగా వాడుకోవాలనే వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని సంధ్యారాణి మండిపడ్డారు. ఇటువంటి మానవీయ విషాదంలో రాజకీయాలు చేయడం తీవ్రమైన అనైతిక చర్య అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాల బాదను అర్థం చేసుకుని, ఇలాంటి సమయాల్లో అన్ని వర్గాలు ఐక్యంగా నిలిచి సహాయం చేయాలని ఆమె పిలపునిచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు. మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి తగిన వైద్యసేవలు అందేలా అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసిందని వెల్లడించారు.
అయితే.. ఈ ఆలయం ప్రభుత్వ, దేవాదాయ శాఖ నియంత్రణలో లేని ఓ ప్రైవేట్ వ్యవస్థ ఆధ్వర్యంలో నడుస్తోందని మంత్రి సంధ్యారాణి చెప్పుకొచ్చారు. కార్యక్రమం నిర్వాహకులు ప్రభుత్వ యంత్రాంగానికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, భారీ జనసందోహం ఉన్నప్పటికీ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. కార్యక్రమం నిర్వహించిన కమిటీ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని మంత్రి ధ్వజమెత్తారు. త్వరలోనే ఘటనకు బాధ్యులైైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి సంధ్యారాణి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి
Indias Heaviest Communication Satellite: ఇస్రో భారీ ప్రయోగం