Nirmala Sitharaman in GCC Summit: దేశానికి, రాష్ట్రానికి ఇది గొప్ప పరిణామం
ABN , Publish Date - Sep 17 , 2025 | 07:43 PM
దేశ అభివృద్ధిలో జీసీసీలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. జీసీసీలు ఏర్పడితే భారతదేశం వరల్డ్ హబ్గా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విశాఖపట్నం: రుషికొండలో జరిగిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) బిజినెస్ సదస్సులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ (Confederation of Indian Industry) నివేదికను ఇద్దరూ సంయుక్తంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం వేగంగా ముందుకెళ్తోందని అన్నారు.
దేశ అభివృద్ధిలో జీసీసీ(Global Capability Centers)లు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా జీసీసీలు ఏర్పాటు కావడం మంచి పరిణామమన్నారు. జీసీసీలు ఏర్పడితే భారతదేశం వరల్డ్ హబ్గా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. మానవ వనరుల వినియోగం, నైపుణ్యం పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అమరావతి ప్రస్తుతం ఫిన్టెక్ కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇన్నోవేషన్ హబ్లు ఏర్పడుతున్నాయని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని చెప్పారు. స్టార్టప్లకు ప్రోత్సాహం, యువతకు శిక్షణ, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు సిద్ధమవుతున్నాయని, అరకు కాఫీకి ప్రత్యేక గుర్తింపు అందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక రంగాలను మినహాయించి మిగతా అన్ని రంగాల్లోనూ ప్రైవేటీకరణకు అనుమతి ఇవ్వడం వల్ల రాష్ట్రాల్లో ప్రైవేట్ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని తెలిపారు.
Also Read:
విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
For More Latest News