Shrusti Fertility Case: సృష్టి ఫెర్టిలిటీ కేసు.. విశాఖలో శిశువుల అక్రమ రవాణా
ABN , Publish Date - Aug 08 , 2025 | 02:22 PM
సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ స్కాంలో ఇప్పటి వరకూ ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖపట్నం: సృష్టి ఫెర్టిలిటీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. శిశువుల అక్రమ రవాణా, మధ్యవర్తుల హస్తంతో నడిచిన ఈ అమానవీయ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ స్కాంలో ఇప్పటి వరకూ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, హైదరాబాద్ పోలీసులు విచారణలో భాగంగా విశాఖలో ముగ్గురు మధ్యవర్తులు అయిన విజయ్, సరోజ, రత్నాను అరెస్టు చేశారు.
ఈ మధ్యవర్తులు శిశువుల కొనుగోలు, అమ్మకాల్లో కీలకంగా వ్యవహరించినట్లు ఆధారాలు లభించాయని సమాచారం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారంలో నవజాత శిశువులను పేద కుటుంబాల నుంచి తీసుకొని దరఖాస్తు చేసుకున్న జంటలకు పెద్ద మొత్తాలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పూర్తిగా వ్యాపార ధోరణితో నడిచిన శిశువుల అక్రమ ముఠాగా భావిస్తున్నారు.
ఈ కేసులో మరొక షాకింగ్ విషయమేమిటంటే, డాక్టర్ నమ్రత స్నేహితులు అయిన డాక్టర్ రమ్య, డాక్టర్ రవిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ శిశువుల అక్రమ రవాణా వ్యవహారంలో ప్రత్యక్ష, పరోక్షంగా భాగమయ్యారన్న ఆరోపణలపై అరెస్ట్ చేశారు. డాక్టర్ రవి, ప్రస్తుతం కేజీహెచ్ ఆసుపత్రిలో అనస్థీషియా విభాగంలో పని చేస్తున్నారు. ఇటువంటి బాధ్యత గల స్థాయిలో ఉన్న వైద్యులు కూడా అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారన్న ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.
ఈ కేసులో ఇంకా పలువురిపై అనుమానాలు ఉన్నాయని, వీరిలో కొంతమంది రాజకీయ, సామాజికంగా బలమైన వారిగా ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. విశాఖలో ఇంకా అరెస్టులు పెరిగే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
Also Read:
వైసీపీ నేతల దాడి.. బాధితుడు పవన్ మిస్సింగ్
తెలుగింటి ఆడపడుచులందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
For More Latest News