Share News

Vice President: విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి..

ABN , Publish Date - Sep 24 , 2025 | 07:42 PM

విజయవాడ ఉత్సవ్ మరో వందేళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నట్లు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్ అన్నారు. ఇవాళ ఆయన విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొన్నారు.

Vice President: విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి..
vice president cp radhakrishnan

విజయవాడ, సెప్టెంబర్ 24: విజయవాడ ఉత్సవ్ మరో వందేళ్లపాటు కొనసాగాలని కోరుకుంటున్నట్లు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ(బుధవారం) ఉపరాష్ట్రపతి విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొన్నారు. అంతకంటే ముందు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ రాబోయే రోజుల్లో అభివృద్ది చెందిన నగరంగా ఉండబోతోందని ఉపరాష్ట్రపతి చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి అయ్యాక మొట్టమొదటి ప్రయాణం విజయవాడకే వచ్చానని చెప్పిన ఆయన.. తనకు అద్భుతమైన గౌరవం దక్కిందన్నారు.


తెలుగు సంప్రదాయాలను గొప్పగా ప్రదర్శించిన విజయవాడలో పర్యటించినందుకు గర్విస్తున్నానని ఉపరాష్ట్రపతి అన్నారు. 'కనకదుర్గ పేరులోనే అనుగ్రహం, ప్రేమామృతాన్ని చూడగలుగుతున్నాం. రాష్ట్ర ప్రజలు భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు' అని రాధాకృష్ణన్ చెప్పారు.

'నవరాత్రుల్లో అందరం దుర్గమ్మను భక్తితో పూజిస్తాం. దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకం. అద్భుతమైన సంస్కృతి, సంప్రదాయాలను దేశ ప్రజలు కొనసాగిస్తున్నారు. మరే ఇతర పండుగలు లేని విధంగా 9 రోజులపాటు అమ్మవారిని పూజించడం ఎంతో అదృష్టం. మహిళా శక్తినీ గౌరవించడం భారతీయుల సంప్రదాయం. అన్నపూర్ణ దేవిగా అమ్మవారిని కొలవడం శక్తి, భక్తిని ప్రసాదిస్తుంది.


ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్, వైద్య రంగాల్లో అభివృద్ధిని కొనసాగిస్తోంది. వికసిత భారత్ అనేది నిజం.. అది ఒక కల కాదు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా సీఎం చంద్రబాబు నాయకత్వం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కొనసాగుతోంది' అని ఉపరాష్ట్రపతి అన్నారు.

ముందుగా తెలుగు భాషలో అందరికీ నమస్కారం చెప్పిన సీపీ రాధాకృష్ణన్.. అందమైన తెలుగులో పాటలు అద్భుతంగా ఉంటాయన్నారు. సుందర తెలుగు అనడానికి కారణం సాహిత్య భరితంగా, సంగీత భరితంగా తెలుగు భాష ఉండటమేనని ఆయన కొనియాడారు. గాయని గీతా మాధురిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 08:11 PM