Share News

Nara Lokesh: సీఎం చంద్రబాబు లక్ష్యమదే.. ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్‌లో మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Sep 08 , 2025 | 01:46 PM

ఎన్డీఏలో టీడీపీ చేరిందని, ఈ మేరకు కూటమికి నిబద్ధతతో మద్దతు ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్డీఏ అభ్యర్థిని తాము సపోర్ట్ చేస్తామని అన్నారు.

Nara Lokesh: సీఎం చంద్రబాబు లక్ష్యమదే.. ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్‌లో మంత్రి లోకేశ్..
Nara Lokesh india today

అమరావతి: ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2025కు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన కీలక ప్రశ్నలకు లోకేశ్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి టీడీపీ ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుందని ఈ సందర్భంగా లోకేశ్ స్పష్టం చేశారు. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కి తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. కాగా, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరిగింది.

ఎన్డీఏలో టీడీపీ చేరిందని, ఈ మేరకు కూటమికి నిబద్ధతతో మద్దతు ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఎన్డీఏ అభ్యర్థిని తాము సపోర్ట్ చేస్తామని అన్నారు. సరైన సమయం, సరైన స్థలం, సరైన నాయకత్వం అన్నీ కలిస్తేనే గొప్ప మార్పు వస్తుందని మంత్రి ఉద్ఘాటించారు. అది ఉపరాష్ట్రపతి ఎన్నికైనా, ఇతర ఎన్నికలైనా తమ స్టాండ్ క్లియర్‌గా ఎన్డీఏ అభ్యర్థికే ఉన్నట్లు స్పష్టం చేశారు.


ఎన్డీఏ మొదట తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత, టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీలో సీపీ రాధాకృష్ణన్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు లోకేశ్ గుర్తు చేశారు. కానీ ఇండియా కూటమి తమ అభ్యర్థి జ‌స్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని ఆ తర్వాత ప్రకటించిందని చెప్పారు. అప్పటికే టీడీపీ మద్దతు సీపీ రాధాకృష్ణన్ కు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. తాము సీపీఆర్‌కి సపోర్ట్ చేస్తున్నామనే విషయం వాళ్లకు తెలుసని.. అయినా కావాలనే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు లోకేశ్. అలాంటి రాజకీయాలకు తాము లొంగమని మరోసారి స్పష్టం చేశారు.


ఇండియా కూటమి అభ్యర్థి జ‌స్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగువారని.. తెలుగు వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తారా? లేదా జాతీయ రాజకీయాలా? అని విలేకరులు ప్రశ్నించినప్పుడు.. టీడీపీ స్లోగన్.. భారత్ ఫస్ట్ అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. తమ ఎజెండా భారత్ ఫస్ట్ అని.. ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నట్లు చెప్పారు. దేశాన్ని ముందుండి నడిపించే నాయకత్వానికే సపోర్ట్ చేస్తామన్నారు. మోదీ నాయకత్వానికి వంద శాతం మద్దతు ఇస్తామని, ఉపరాష్ట్రపతి ఎన్నికల వల్ల తమ ఫోకస్ మారదని లోకేశ్ తేల్చి చెప్పారు.


దేశ రాజకీయాల్లోకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తారా? అని ప్రశ్నించినప్పుడు.. టీడీపీ అధినేత లక్ష్యాన్ని పత్రికా ముఖంగా లోకేశ్ వివరించారు. సీఎం చంద్రబాబు రెండు కళ్లూ ఆంధ్రప్రదేశ్‌పైనే ఉన్నాయని, ఆయన లక్ష్యం ఒక్కటేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని నంబర్ వన్ రాష్ట్రంగా మార్చడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఏపీని అభివృద్ధి చేయడమే తమ గోల్ అని.. రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టారు మంత్రి లోకేశ్. 2029 ఎన్నికల వరకూ తాము ఎన్డీఏ ప్రభుత్వానికే మద్దతు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.


మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించగా.. సమర్థిస్తున్నట్లు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గతంలో తాను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసినట్లు ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేశారు. ఆ సమయంలో మాతృభాషపైనే దృష్టి పెట్టాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. నూతన విద్యా విధానంలో మూడు భాషలు నేర్చుకోవాలని చెబుతున్నప్పటికీ.. హిందీని ఎక్కడా తప్పనిసరి చేయలేదని వెల్లడించారు. తానూ మూడు భాషలు నేర్చుకున్నానని, తన కుమారు దేవాన్ష్ కూడా నేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఉత్తరాది వారూ సౌత్ భాషలు నేర్చుకోవాలా? అని విలేకరి ప్రశ్నించినప్పుడు.. ఎందుకు నేర్చుకోకూడదు.. అందులో తప్పేం లేదని మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2025 | 03:13 PM