TDP Leaders : రాష్ట్రానికి మీరేం చేశారు?
ABN , Publish Date - Feb 11 , 2025 | 05:20 AM
గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని అని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
వైసీపీ నేతలకు టీడీపీ ఎంపీల సూటి ప్రశ్న
సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రాభివృద్ధికి నిధులు: లావు
మిథున్రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు: కలిశెట్టి
పాడి రైతులను దోచుకున్న ఘనుడు పెద్దిరెడ్డి: దగ్గుమళ్ల
300 కోట్లకు రైతులను మోసం చేసిన మిథున్రెడ్డి: శబరి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ‘అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం కోసం ఏం చేశామో చెప్పకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరును విమర్శించడం సబబు కాదు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో అసలు అభివృద్ధి జరగలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని అని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. సోమవారం ఇక్కడ ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాదరావు, బైరెడ్డి శబరి, శ్రీభరత్తో కలసి లావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం కేంద్రం నుంచి సాధించుకున్న నిధుల వివరాలను వివరించారు. ‘మేం అధికారంలోకి వచ్చిన 8నెలల్లోనే పోలవరానికి కేంద్ర రూ.12 వేల కోట్లు ఇచ్చింది. రాబోయే నాలుగేళ్ల కాలంలో ఇంకా సాయం చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల్లో ఐదు కాలేజీల నిర్మాణ పనులు కొంతమేర జరిగాయి. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన మూడు వైద్య కళాశాలల్లో ఒక కాలేజీ నా నియోజకవర్గంలో నిర్మాణంలో ఉంది. రాష్ట్రప్రభుత్వం తన నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణం ఆగిపోయింది. మిగతా మెడికల్ కాలేజీలకు గత ప్రభుత్వంలో భూములు మాత్రమే కేటాయించారు’ అని లావు పేర్కొన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ... ‘కూటమి ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రానికి దక్కాల్సిన గౌరవం కూడా దక్కుతున్నందున నాకెంతో సంతోషంగా ఉంది. లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి సభను తప్పుదోవ పట్టించేవిధంగా మాట్లాడారు’ అన్నారు.
ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. వైసీపీ నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి పాడి రైతులను తక్కువ ధరకు పాలను అమ్మాలని బెదిరించేవారు’ అని ఆరోపించారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ‘వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి సంబంధించి రూ.3 వేల కోట్ల లిక్కర్ స్కాం బయటపడడంతో లోక్సభలో ఆయన మతితప్పి మాట్లాడుతున్నారు. రిజర్వాయర్లు పేరిట రైతుల నుంచి రూ.300 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. లోక్సభలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిపై, మిథున్రెడ్డి చేసిన వ్యాఖ్యలను లోక్సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి, ఆ వ్యాఖ్యలను తొలగించాలని కోరుతాం’ అన్నారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?