Nambala Kesav rao: మావోయిస్ట్ అగ్రనేతల మృతదేహాల తరలింపునకు ఎస్పీ అడ్డంకులు
ABN , Publish Date - May 25 , 2025 | 12:51 PM
ఇటీవల ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్ మరణించారు. వీరి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు వారి బంధువులకు జిల్లా ఎస్పీ అడ్డంకులు సృష్టిస్తున్నారు.
అమరావతి, మే 25: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్ట్ అగ్రనేతలు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, నవీన్ మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోమ్ మంత్రి వంగలపూడి అనితకు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనితకు పౌర హక్కుల సంఘం ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్ లేఖ రాశారు.
వీరిద్దరి మృతదేహాలను స్వస్ధలాలకు తీసుకురావటానికి గత మూడ్రోజులుగా వారి కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ క్రమంలో నంబాల కేశవరావు కుటుంబసభ్యులకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అనేక విధాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ లేఖలో వివరించారు. కేశవరావు మృతదేహం కోసం ఛత్తీస్గఢ్లో గురువారం ఉదయం అతడి సోదరుడు వేచి ఉన్నారని, అయితే బస్తర్ ఐజీ సుందర్ రాజ్తోపాటు శ్రీకాకుళం ఎస్పీ అతడిని బలవంతంగా వెనక్కి పంపారని ఆ లేఖలో స్పష్టం చేశారు.
మరో మృతుడు నవీన్ కుటుంబసభ్యులతో కలిసి కేశవరావు సోదరుడు.. జిల్లా ఎస్పీని కలిసి దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడినా.. మృతదేహాలను తీసుకెళ్లేందుకు నిరాకరించారని తెలిపారు. అంతేకాకుండా.. నాటి నుంచి వారి మీద నిఘా ఉంచడమే కాకుండా.. గృహ నిర్బందంలో ఉంచారని ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే మృతదేహాల కోసం శుక్రవారం హైకోర్టును వారు ఆశ్రయించగా.. ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు కిందిస్థాయి పోలీసు అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఛత్తీస్గఢ్లోనే అంత్యక్రియలు నిర్వహించాలంటూ వారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని వివరించారు.
మరోవైపు ఛత్తీస్గఢ్ పోలీసుల ద్వారా ఆ మృతదేహాలను తీసుకుని అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని వారి రక్త సంబంధీకులకు హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని చెప్పారు. కానీ ఆ ఉత్తర్వుల్లో రంధ్రాన్వేషణ చేస్తూ .. వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆ లేఖలో పౌర హక్కుల సంఘం నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే వారి మృతదేహాలను తీసుకురావటానికి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. ఈ అంశాలన్నీ మీకు తెలుసునని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
ఎందుకంటే ఏపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులందరూ తమతమ వాదనలు విన్న అనంతరం ఈ ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసిందని ఈ సందర్భంగా ఆ లేఖలో ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు గుర్తు చేశారు.
మనిషి మరణాంతరం అతనికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలను బంధువులు, సన్నిహితులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు. అటువంటి వాటిని నిరాకరించేలా వ్యవహరించడం చట్ట వ్యతిరేకమని ఆ లేఖలో వారు స్పష్టం చేశారు. అంతేకాదు.. నైతికంగా పౌరులు సైతం హర్షించరన్నారు. శ్రీకాకుళం ఎస్పీ తనకు తానుగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడంటూ అతడిపై ఆ లేఖలో ఫిర్యాదు చేశారు.
ఎస్పీ ఇలా వ్యవహరించడం వెనుక ఎవరైనా పైఅధికారులు ఉన్నారా? లేక రాజకీయ జోక్యంతో ఆయన ఇలా చేస్తున్నారా? అనే అంశాలను కనుగొని.. ఈ సమస్యను సున్నీతంగా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత వంగలపూడి అనితను ఈ లేఖ ద్వారా ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
For National News And Telugu News