Water Dispute : కృష్ణాలో గోదావరి జలాలను కలపొద్దు
ABN , Publish Date - Feb 09 , 2025 | 05:10 AM
కృష్ణానదిలో గోదావరి జలాలను కలపకండి’ అంటూ నవ్యాంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
బనకచర్లలో నేరుగా గోదావరి జలాలు ఎత్తిపోయండి
అంతర్ రాష్ట్ర జల వివాదాలకు తావివ్వొద్దు
మూడు దశల్లో ఈ ప్రాజెక్టు చేపట్టండి
సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఇంజనీర్ల సంఘం లేఖ
అమరావతి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): ‘అంతర్ రాష్ట్ర జలవివాదానికి తావివ్వకండి. కృష్ణానదిలో గోదావరి జలాలను కలపకండి’ అంటూ నవ్యాంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ లేఖను సీఎం చంద్రబాబుకు సంఘం అధ్యక్షుడు ఎం విశ్వేశ్వరరావు రాశారు. ‘బనకచర్లలో నేరుగా గోదావరి జలాలను ఎత్తిపోయాలి. దీంతో గోదావరి-బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్టు కృష్ణా నదీ జలాల వివాదాల ట్రైబ్యునల్ (కేడబ్ల్యుడీటీ) పరిధిలోకి వెళ్లదు. కృష్ణా నదిలో గోదావరి జలాలను కలిపితే... ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం 80 టీఎంసీలను మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచుకోవాల్సి ఉంటుంది’ అని ఇంజనీర్ల సంఘం లేఖలో గుర్తు చేసింది.
సంఘం ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి...
వివాదాలకు తావివ్వకుండా మూడు దశల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలంటూ ఆ సంఘం కొన్ని ప్రతిపాదనలు సీఎంకు పంపించింది. ‘పోలవరం నుంచి కృష్ణా నదీ జలాలను తాకకుండా తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి ప్రస్తుతం ఉన్న కాల్వలను 24,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి విస్తరించాలి. ఈ కాలువను సాగర్ కుడి ప్రధాన కాలువ 80వ కిలోమీటరు వరకూ తీసుకువెళ్లాలి. అక్కడ గోదావరి జలాలు కలవకుండా ఆఫ్టేక్ రెగ్యులేటర్ను నిర్మించి సోమశిల రిజర్వాయరుకు తరలించాలి. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయరుకు ఎత్తిపోయాలి. బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయరును నిర్మించి అక్కడ నుంచి వరద కాలువకు అనుసంఽధానం చేస్తూ కిందకు పంపించాలి. బొల్లాపల్లి నుంచి నల్లమల సాగర్కు, అక్కడ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు తరలించాలి. నల్లమల రిజర్వాయరు నుంచి క్రాసింగ్ ఫీడర్ ద్వారా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కు టన్నెల్ ద్వారా గోదావరి జలాలు తరలించాలి’ అని ప్రతిపాదించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..